
యోసు (కొరియా): ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ కొరియా ఓపెన్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్లో వరల్డ్ మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–15, 24–22తో రెండో ర్యాంకర్ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) పై గెలిచింది. చైనీస్ ప్రత్యర్థులపై సాత్విక్ జోడీ గెలవడం ఇదే మొదటిసారి. గతంలో తలపడిన రెండుసార్లూ ఓడింది. 40 నిమిషాల మ్యాచ్లో రెండు జంటలు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడాయి. దీంతో తొలి గేమ్ 3–3, 5–5తో ముందుకు సాగింది. అయితే ర్యాలీల్లో ఆధిపత్యం చూపెట్టిన సాత్విక్ ద్వయం 7–5, 14–8 లీడ్లో నిలిచింది. తర్వాత సాత్విక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లోనూ ఇరువురు ప్లేయర్లు ఒకరి తర్వాత ఒకరు పాయింట్లు నెగ్గడంతో స్కోరు బోర్డు 8–8తో సమంగా నిలిచింది. ఈ దశలో చిరాగ్ బేస్ లైన్ షాట్స్తో రెండు పాయింట్లు నెగ్గాడు. ఆపై, చైనా ప్లేయర్ కొట్టిన షాట్ వైడ్గా వెళ్లడంతో ఇండియా జోడీ 11–8 ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి వాంగ్ బ్యాక్ హ్యాండ్ నెట్ షాట్స్తో పాయింట్లు రాబట్టడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరకు 18–18, 19–19, 22–22తో సమమైంది. ఈ సమయంలో నాలుగో గేమ్ పాయింట్ను సాత్విక్ క్రాస్ కోర్టు షాట్గా మలిచాడు. ఆ వెంటనే చైనీస్ ప్లేయర్ కొట్టిన షాట్ నెట్కు తాకడంతో ఇండియా జోడీ విజయం ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో సాత్విక్–చిరాగ్... నాలుగోసీడ్ సో యోంగ్–కాంగ్ హి యాంగ్ (కొరియా)తో తలపడతారు.