న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో చేసిన ప్రమాణం సరిగా లేదని పిల్ వేసిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పనికిమాలిన అంశాలపై పిల్స్ వేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్..పిటిషనర్కు రూ.5 లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సరిగా జరగలేదని, రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్కు విరుద్ధంగా చేశారని లక్నోకు చెందిన అశోక్ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి తన పేరు ముందు ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించలేదని, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రా నగర్హవేలీ ప్రభుత్వ ప్రతినిధులను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించలేదని అశోక్పాండే పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్శనివారం విచారణ చేపట్టింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారని, దానిపై అభ్యంతరాలు లేవనెత్తడానికి ఏమీ లేదని, ఇది పిటిషనర్ప్రచారం పొందడానికి చేసిన పనికిమాలిన ప్రయత్నమేనని కోర్టు పేర్కొంది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్కు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని పిటిషనర్ నెల రోజుల్లో కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్చేయాలని బెంచ్ తీర్పునిచ్చింది. ఒక వేళ జమచేయకుంటే.. లక్నో కలెక్టర్ ద్వారా అతని వద్ద నుంచి భూ ఆదాయ బకాయిలుగా వసూలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.