- బ్యాండ్ పోటీలతో స్టూడెంట్లలో లీడర్షిప్ క్వాలిటీస్: నవీన్ నికోలస్
హైదరాబాద్, వెలుగు: స్కూల్ స్థాయి నుంచే బ్యాండ్ పోటీల్లో పాల్గొనడంతో విద్యార్థుల్లో లీడర్షిప్ క్వాలిటీస్, ధైర్యం, క్రమశిక్షణ అలవడుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. చిన్నప్పటి నుంచే డిసిప్లిన్, యూనిఫామ్ అలవాటు చేసుకుంటే.. భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్ వంటి యూనిఫామ్ సర్వీసుల్లో చేరేందుకు స్టూడెంట్లకు మార్గం సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయి బ్యాండ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను నవీన్ నికోలస్ ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థుల్లో సేవా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయని గుర్తుచేశారు.

