
- 54 లక్షల పుస్తకాలు.. 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ
- ఏండ్ల కింద మూతబడిన స్కూల్స్ తిరిగి ప్రారంభం
హైదరాబాద్, వెలుగు : వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి బడిగంటలు మోగాయి. సర్కార్, ప్రైవేట్ బడులు, రెసిడెన్షియల్ స్కూళ్లు తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని స్కూళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ల రీఓపెన్ పండుగలా సాగింది.
పలు గ్రామాల్లో స్కూళ్లకు వచ్చిన స్టూడెంట్లకు టీచర్లు వినూత్నంగా స్వాగతం పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ప్రత్యేక స్వాగత తోరణం ఏర్పాటు చేయడంతో పాటు స్టూడెంట్లతో కేక్ కట్ చేయించారు. కోదాడలోని ప్రభుత్వ స్కూల్కు చెందిన స్టూడెంట్లను ఓపెన్ టాప్ జీప్లో స్కూల్కు తీసుకెళ్లారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా చింతపల్లిలో స్కూల్కు వచ్చిన స్టూడెంట్లపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఇక్కడ రైలు బోగి డిజైన్లో క్లాస్రూమ్స్కు రంగులు వేయడం విశేషంగా
ఆకట్టుకుంది.
54 లక్షల పుస్తకాలు.. 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ
తొలిరోజే ప్రభుత్వ స్కూళ్లకు వచ్చిన పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 27,852 సర్కార్, ఎయిడెడ్, గురుకుల స్కూళ్లు ఉండగా, ఇప్పటివరకు 1.01 కోట్ల పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. 8,33,398 మంది విద్యార్థులకు 54,52,708 పుస్తకాలను అందజేశారు. మరో వైపు ఈ ఏడాది 20,30,667 మంది స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి రోజు స్కూల్కు హాజరైన స్టూడెంట్లందరికీ ఒక జత యూనిఫామ్ అందజేశారు. రెండో జతను సాధ్యమైనంత త్వరలో అందజేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి స్కూల్ లెవల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఓ సబ్జెక్ట్గా బోధిస్తుండడంతో దానికి సంబంధించిన పుస్తకాలను సైతం అందించనున్నారు. స్కూళ్లలో స్టూడెంట్ల అడ్మిషన్లపై సర్కారుతో పాటు అధికారులూ ఫోకస్ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నేతృత్వంలోనే అన్ని బడుల్లో సౌకర్యాలు కల్పించారు. 210 ప్రైమరీ స్కూళ్లలోనూ ప్రీప్రైమరీ సెక్షన్లలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఏండ్ల కింద మూతబడిన స్కూల్స్ రీఓపెన్
కోహెడ (హుస్నాబాద్)/బోధన్, వెలుగు : ఏండ్ల కింద మూతపడిన స్కూళ్లలో ఈ సంవత్సరం స్టూడెంట్లు చేరడంతో అవి పునఃప్రారంభం అయ్యాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండలోని ప్రైమరీ స్కూల్ నాలుగేండ్ల కింద మూతపడింది. ఈ స్కూల్లో ప్రస్తుతం 34 మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకున్నారు. దీంతో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి కలిసి స్కూల్ను ప్రారంభించారు.
అనంతరం స్టూడెండ్లకు యూనిఫామ్స్ అందజేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా బోధన్మండలంలోని భవానిపేట ప్రైమరీ స్కూల్ 11 ఏండ్ల కింద మూతపడింది. ఈ ఏడాది 21 మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకోవడంతో గురువారం సబ్ కలెక్టర్ వికాస్ మహతో స్కూల్ను రీఓపెన్ చేశారు.