- భూమిపూజ చేసిన కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, కిషన్రెడ్డి
- సైన్స్సిటీ ఏర్పాటుకు గత సర్కార్ భూమి ఇయ్యలేదన్న కిషన్రెడ్డి
- ప్రస్తుత ప్రభుత్వమైనా భూమి ఇవ్వాల నిసూచన
సికింద్రాబాద్, వెలుగు : ఒక దేశ సంస్కృతికి విజ్ఞాన శాస్త్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని.. సైన్స్, కల్చర్ లేకుండా పూర్తిగా అభివృద్ధిని సాధించలేమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో వీటిని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ఏర్పాటు చేయనున్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కు ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనలు చేసేలా సమాజంలో అవగాహన కల్పించాలని తెలిపారు.
‘‘ఫార్మా రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ గా మారింది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంపై దృష్టి పెట్టే ఫార్మా పరిశ్రమల కోసం ఈ క్లస్టర్ను ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ గా గుర్తించింది” అని అన్నారు. సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రధానంగా సమాజంలో సైన్స్ కల్చర్ను వ్యాప్తి చేయడంలో సహకరిస్తుందని చెప్పారు.
ప్రత్యేకంగా స్టూడెంట్లలో ‘కమ్యూని కేటింగ్ సైన్స్ టు ఎంపవర్ పీపుల్’ అనే నినాదంతో ఇన్నోవేషన్స్, ఇంటరాక్టివ్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లు నిర్వహించడంలో దోహదపడుతుందన్నారు. స్టార్టప్ల కోసం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.
400 కోట్లతో సెంటర్
యువతలో ఇన్నొవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని.. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన జాగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. రూ.400 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసీటీ లోనే ప్రస్తుతం సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వచ్చే సంవత్సరం సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొదటి దశ పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా దీనికి అవసరమైన భూమి నికేటాయిస్తే భవిష్యత్తులో ఈ సెంటర్ సైన్స్ సిటీగా రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కలై సెల్వీ, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.