
- న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వాట్సాప్, ఈ మెయిల్స్ ఆధారంగా, నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బహిరంగ ప్రాంతాల్లో ఆరోపణలు, కులం పేరుతో దూషణలు చేసి ఉండాలని పేర్కొంది. భార్యాభర్తల మధ్య నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనతోపాటు వారి మధ్య జరిగిన వాట్సాప్, ఈ మెయిల్స్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేసి విచారించడం న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది.
విడాకులు తీసుకున్న తరువాత భర్త పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ సికింద్రాబాద్కు చెందిన డి.నిరుపమ, ఆమె తండ్రి అనుపమ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల న్యాయవాది విమల్ వర్మ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ను ఎస్సీ వర్గానికి చెందిన ఫిర్యాదుదారు కె.క్రాంతికిరణ్ రెండో పెళ్లి చేసుకున్నారని, అభిప్రాయ భేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు పొందారని తెలిపారు. తరువాత ఫిర్యాదుదారు వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్స్లో ఉన్న వాటి ఆధారంగా 10 నెలల తరువాత పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇంట్లో జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసును కొనసాగించలేమన్నారు. పిటిషనర్లపై కింది కోర్టులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.