గ్రూప్ ఇన్సూరెన్స్ను రూ.10 లక్షలకు పెంచండి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

గ్రూప్ ఇన్సూరెన్స్ను రూ.10 లక్షలకు పెంచండి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  •     రోస్టర్’ ను మినహాయింపులు లేకుండా అమలు చేయాలి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్​లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం, రోస్టర్ అమలు, బ్యాక్‌‌లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సబ్‌‌ప్లాన్ నిధుల వినియోగంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించింది. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రోస్టర్ విధానాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని శాఖల్లో కచ్చితంగా అమలు చేయాలని,  పెండింగ్‌‌లో ఉన్న బ్యాక్‌‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పదోన్నతుల్లో రోస్టర్ విధానాన్ని   పాటించాలని చెప్పారు.  

గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించాలని సూచించారు. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని, అన్ని కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తామన్నారు. కమిషన్ మెంబర్లు నీలాదేవి, రాంబాబు నాయక్,  లక్ష్మీనారాయణ, శంకర్, ప్రవీణ్‌‌  పాల్గొన్నారు.