
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 43,568 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సీట్ల అలాట్మెంట్ వివరాలను ప్రకటించారు.
సెకండ్ ఫేజ్లో మొత్తం 46,883 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని, కానీ తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో 3,315 మందికి సీట్లు అలాట్ కాలేదని తెలిపారు. అయితే, ఫస్ట్ ప్రయారిటీ కాలేజీలోనే 30,973 మందికి సీట్లు వచ్చినట్టు వివరించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 18లోగా రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టు చేయాలని, తద్వారా సీటు రిజర్వ్ అవుతుందని చెప్పారు.
లేకపోతే సీటు రద్దు అవుతుందని తెలిపారు. సీట్లు పొందిన వారిలో కామర్స్ కోర్సులో 13,900 మంది, ఫిజికల్ సైన్స్లో 11,277 మంది, లైఫ్ సైన్సెస్లో 8,821 మంది, ఆర్ట్స్లో 5,032 మంది, ఇతర గ్రూపుల్లో 4,538 మంది ఉన్నారు. కాగా, ఫేజ్3 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు కొనసాగుతుందని
అధికారులు వెల్లడించారు.