- సెకండ్ డోస్ షార్టేజ్!
- కొవాగ్జిన్ రెండో డోస్ దొరక్క జనం తిప్పలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ షార్టేజ్తో జనం తిప్పలు పడుతున్నారు. కొవిషీల్డ్ వేసుకున్న వాళ్లకు ఇబ్బంది లేకున్నా కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ డోస్ వేసుకోవడానికి సెంటర్ల వద్దకు వెళ్తే సిబ్బంది వెనక్కి తిప్పి పంపుతున్నారు. లేదంటే ఇంకో సెంటర్కు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో అసలు సెకండ్ డోస్ వేస్తారా.. లేదా అని జనం ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సినేషన్ ప్లానింగ్ లోపం వల్లే షార్టేజ్ అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ర్టానికి ఇప్పటివరకు 26.78 లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్రం పంపింది. వీటిలో 4.22 లక్షల కొవాగ్జిన్ డోసులున్నాయి. ఇప్పటివరకు ఇందులో 2,48,663 డోసులను వాడారు. ఇంకో 1.73 లక్షలు హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఇన్ని డోసులున్నా సెకండ్ డోస్ కోసం వెళ్లిన వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదు.
వ్యాక్సిన్ షార్టేజ్ బోర్డులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన వ్యాక్సినేషన్ గైడ్లైన్స్ ప్రకారం సెకండ్ డోసుకు ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచుకోవాలి. కానీ మన దగ్గర జరిగిన ప్లానింగ్ లోపాలతో సెకండ్ డోసుకు కృత్రిమ షార్టేజ్ ఏర్పడింది. ఇది కూడా కొన్ని చోట్లే ఉండటం, ప్లానింగ్ లోపాలను బయట పెడుతోంది. ఫస్ట్ డోస్ కొవాగ్జిన్ సప్లై చేసిన సెంటర్లకు, సెకండ్ డోసుకు అవసరమైన టీకాలు ఇవ్వడం లేదు. దీంతో సెకండ్ డోస్ కోసం వెళ్లిన వాళ్లను వెనక్కి తిప్పి పంపుతున్నారు. వ్యాక్సిన్ షార్టేజ్ ఉందని బోర్డులు పెడుతున్నారు. వ్యాక్సిన్లు సర్కారు ఇవ్వకపోవడం వల్లే తాము జనాలను వెనక్కి పంపిస్తున్నామని డాక్టర్లు అంటున్నారు. ప్లానింగ్లో లోపాలను సరిచేస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
రాష్ట్రంలో 5.6 లక్షల డోసులే ఉన్నయ్: సీఎస్
తెలంగాణకు 30 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్కు సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం లెటర్ రాశారు. రాష్ట్రంలో 5.66 లక్షల వ్యాక్సిన్ డోసులే ఉన్నాయని, అవి మూడ్రోజులకే సరిపోతాయని తెలిపారు. 15 రోజులకు సరిపడా 30 లక్షల డోసులను వెంటనే పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోందని లెటర్తో తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 1.15 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, మున్ముందు దీన్ని రోజుకు 2 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.