సెప్టెంబర్ 26 నుంచి ఫిన్లాండ్‌‌లో రెండో విడత టీచర్ల పర్యటన

సెప్టెంబర్ 26 నుంచి ఫిన్లాండ్‌‌లో రెండో విడత టీచర్ల పర్యటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూల్  టీచర్ల రెండో విడత ఫిన్లాండ్‌‌ పర్యటన ఈ నెల26 నుంచి ప్రారంభం కానుంది. టీచర్స్‌‌ ఎక్స్‌‌పోజర్‌‌ విజిట్‌‌ అండ్‌‌ ఎడ్యుకేషనల్‌‌ ఎక్స్చేంజ్  ప్రోగ్రాం కింద మొత్తం 40 మందితో కూడిన టీచర్లు, ఆఫీసర్ల బృందాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్  నవీన్  నికోలస్  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందం 26 నుంచి అక్టోబర్‌‌ 3 వరకు వారం రోజుల పాటు ఫిన్లాండ్‌‌లో పర్యటించనుంది. అక్కడ అమలవుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడే పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 33 మంది టీచర్లను ఎంపిక చేశారు. వీరిలో 12 మంది హెచ్ఎంలు, 10 మంది స్కూల్​ అసిస్టెంట్​లు, 8 మంది ఎస్జీటీలు, ముగ్గురు మోడల్  స్కూల్  టీచర్లు ఉన్నారు. వీరితో పాటు సమగ్ర శిక్ష  జేడీ ఉషారాణి, నల్గొండ డీఈవో సుశీందర్ రావు, బాలానగర్  ఎంఈవో హరిశ్చంద్ర ఉన్నారు.

నేడు సింగపూర్​కు టీచర్ల టీమ్.. 

అంతర్జాతీయ విద్యా విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన కోసం 40 మంది టీచర్లు, అధికారులతో కూడిన ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్  నుంచి సింగపూర్  పయనం కానుంది. టీచర్స్  ఇంటర్నేషనల్  ఎక్స్‌‌పోజర్  విజిట్  అండ్  ఎడ్యుకేషనల్  ఎక్స్ఛేంజ్  ప్రోగ్రామ్(బ్యాచ్–1) కింద ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. నేషనల్  ఇన్‌‌స్టిట్యూట్  ఆఫ్  ఎడ్యుకేషన్(ఎన్ఐఈ– సింగపూర్) భాగస్వామ్యంతో వారం రోజుల పాటు ఈ  స్టడీ టూర్​ సాగనుంది.