కమిటీలంటే కాలయాపనే

కమిటీలంటే కాలయాపనే
  • రెగ్యులరైజేషన్ అంశంలో సర్కార్ నిర్ణయంపై సెక్రటరీల ఆగ్రహం
  • 4 ఏండ్లు పూర్తి చేసుకున్న జేపీఎస్​లను 
  • రెగ్యులర్ చేయాల్సిందే  
  • కమిటీలు, మీటింగ్​లు అంటూ మరో 3 నెలలు సాగదీస్తరని డౌట్ 
  • ఆ లోపు ఎలక్షన్ కోడ్ వస్తుందని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్)లను రెగ్యులరైజ్ చేసే విషయంపై జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సెక్రటరీలు మండిపడుతున్నారు. నాలుగేండ్ల ప్రొబెషన్ పూర్తయిన జేపీఎస్ ల పని తీరును జిల్లా స్థాయి కమిటీ పరిశీలించాలని, నిర్దేశించిన లక్ష్యాల్లో మూడింట రెండు వంతులు చేరుకున్నోళ్లను మాత్రమే రెగ్యులర్ చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. అయితే, మరింత కాలయాపన చేసేందుకే కమిటీలు అంటున్నారని జేపీఎస్ లు ఫైర్ అవుతున్నారు. 

ప్రొబెషన్ పూర్తి చేసు కున్న జేపీఎస్ లను ఎలాంటి కండీషన్స్ లేకుండా రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం జేపీఎస్ ల 3 ఏండ్ల ప్రొబెషన్ పూర్తయినా, ప్రభుత్వం మరో ఏడాది పెం చింది. ఈ ఏడాది ఏప్రిల్ 28తో అది కూడా పూర్తయి 4 ఏండ్ల ప్రొబెషన్ ముగిసింది. ఇప్పుడు మళ్లీ సెక్రటరీల పనితీరు పరిశీలనకు కమిటీలు, రూల్స్ అనడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పనితీరు బాగాలేదని గతంలోనే తొలగిస్తే వేరే జాబ్ లు చూసుకునేవాళ్లమని కరీంనగర్ కు చెందిన ఓ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత లేట్ చేసేందుకే.. 

జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ను మరింత ఆల స్యం చేయటానికే కమిటీల ఏర్పాటు అంటున్నారని సెక్రటరీలు చెబుతున్నారు. కమిటీ ఏర్పాటు, ఆ కమిటీ మీటింగ్ లు, రూల్స్ ఖరారు చేయటం.. ఈ ప్రాసెస్ అంతా అయ్యేందుకు రెండు మూడు నెలలు టైమ్ పడుతుందని, ఆ లోపు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూ ల్, కోడ్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ముందుకు పడని గ్రేడ్ల విభజన 

2018 ఎన్నికలకు ముందు 500 జనాభా దాటిన తండాలను, పెద్ద గ్రామ పంచాయతీలను విడదీసి సుమారు 4,500 కొత్త గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి చేరింది. అప్పటి నుం చి జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయతీలను గ్రేడ్ 1, 2, 3, 4గా విభజించాలని సెక్రటరీలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు వాటి విభజన కాలేదు. 

మేజర్ జీపీలకు రెగ్యులర్ సెక్రటరీలను నియమించాలని, చిన్న పంచాయతీలకు జూనియర్ సెక్రటరీలను నియమించాలన్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీపీలను గ్రేడ్లుగా విభజించకుండా సెక్రటరీలను రెగ్యులర్ చేస్తే భవిష్యత్ లో లీగల్ సమస్యలు వస్తాయని అసోసియేషన్ నేతలు హెచ్చరిస్తున్నారు. 

ALSO READ :హైదరాబాద్‌ అంబేద్కర్ ​విగ్రహం చూసేందుకు రండి

ఔట్ సోర్సింగ్ వాళ్ల సంగతేంటి? 

2019 ఏప్రిల్ లో 9,355 మంది జేపీఎస్ లు విధు ల్లో చేరారు. అధికారుల వేధింపులు, పని ఒత్తిడి, ఇత ర జాబ్ లు రావటంతో చాలా మంది జేపీఎస్ లు ఈ జాబ్ లకు గుడ్ బై చెప్పారు. కొందరు జేపీఎస్ లు ఒత్తిడి, వేధింపులు  తట్టుకోలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. సెక్రటరీ స్థానం ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండొద్దని సీఎం ఆదేశించటంతో కలెక్టర్లు, డీపీవోలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రూ. 15 వేల జీతానికి కొత్త సెక్రటరీలను రిక్రూట్ చేసు కున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు1,500 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్లు కూడా రెండేండ్లు, మూడేండ్ల చొప్పున టర్మ్ కంప్లీట్ చేసుకున్నారు. తమను కూడా జేపీఎస్ లుగా పరిగణించి, 4 ఏండ్లు పూర్తయ్యాక రెగ్యులర్ చేయాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, సెక్రటరీల ఎంపికలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రెగ్యులర్ చెయ్యాలె  

జేపీఎస్ ల ప్రొబెషన్ టైమ్ ను 3 నుంచి 4 ఏండ్లకు పెంచినపుడే అన్ని అర్హతలు సాధించారు. మళ్లీ ఇప్పుడు కమిటీ, రూల్స్ అని రకరకాల నిబంధనలు అవసరం లేదు. దేశంలో నెంబర్ వన్ పల్లెలు అని చెప్పుకుంటూ కేంద్రం నుంచి ఎన్నో అవా ర్డులు తీసుకుంటున్నారు. 

ఆ అవార్డులకు కారణమైన సెక్రటరీలను రెగ్యులర్ చేయా లని అడిగితే కమిటీల పేర్లు చెబుతూ టైమ్ పాస్ చేస్తున్నరు. జేపీఎస్ లను ఎలాంటి షరతుల్లేకుండా ఒకేసారి రెగ్యులర్ చేయాలి.  - మధుసూధన్ రెడ్డి,  ప్రెసిడెంట్, తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్