సీతాఫల్మండి, వెలుగు : పని చేసే ఇంట్లోనే చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సికింద్రాబాద్ చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి తెలిపిన ప్రకారం.. చిలకలగూడలో ఉండే ఎన్ఎస్ నర్సింహారావు వ్యాపారి. గతవారం బోనాల పండుగ తెల్లారీ తన ఇంట్లోని లాకర్ని తెరిచి చూడగా అందులోని నాలుగు ఆభరణాలు, బంగారు చైన్లు (సుమారు 40 తులాలు) కనిపించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.
డీఐ పి.రుక్మిణి రంగంలోకి దిగి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇంట్లో పని చేసేవారే చోరీ నిందితులుగా తేల్చారు. పనిమనుషులు లోవ కుమారి, వీరబాబు దంపతులు బంగారం ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. ఆంధ్రాకు చెందినవారు. కొంతకాలంగా నర్సింహారావు ఇంట్లో పని చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద 40 తులాలు బంగారం స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు పంపారు. కేసును ఛేదించిన డీఐ పి.రుక్మిణి, టీం ఏసీపీ జైపాల్రెడ్డి అభినందించారు. ఎస్ఐ నాగేశ్వర్, క్రైం టీం వినయ్ కుమార్, గణేశ్, బాష, అన్నపూర్ణ ఉన్నారు.