- ఘటనపై అధికార, విపక్షాల డైలాగ్ వార్
- లోకల్ పోలీసులే కాల్పులు జరిపారన్న డీఎం గుప్తా
- రైల్వే స్టేషన్ విధ్వంసంలో ఇప్పటి వరకు 56 మంది అరెస్ట్
- 2 కోట్లకు పైగా పార్సిల్ నష్టం
- డిఫెన్స్ అకాడమీలే కీలకమంటున్న పోలీసులు
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఆందోళనలో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులే ఎక్కువ మంది పాల్గొన్నట్టు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్టేషన్ లో డ్యామేజ్ అయిన లైట్లు, ఫ్యాన్లను రిపేర్ చేస్తున్నారు రైల్వే అధికారులు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరపాలని తాము ఎవరిని కోరలేదన్నారు రైల్వే డివిజినల్ మేనేజర్ గుప్తా. లోకల్ పోలీసులే కాల్పులు జరిపారన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. స్టేషన్ లో రైల్వే, స్టేట్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 56 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో 19 మందికి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత సికింద్రాబాద్ రైల్వే కోర్టులో ప్రవేశపెట్టారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మిగతా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. తర్వాత విధ్వంసానికి ప్రధాన సూత్రధారిగా చెప్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వాట్సాప్ డాటా ఆధారంగా సెర్చింగ్ చేస్తున్నారు పోలీసులు. ఆడియో, వీడియో రికార్డింగ్స్ పరిశీలిస్తున్నారు. వాట్సప్ గ్రూపుల ఆధారంగా 250 మందికి పైగా దాడులకు పాల్పడినట్టు గుర్తించారు. గ్రూపుల్లో విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టుల పెట్టిన వారి నంబర్స్ ఆధారంగా గాలిస్తున్నారు. గ్రూపుల్లోని నంబర్లకు పోలీసులు ఫోన్ చేసి విచారణకు హైదరాబాద్ రావాలని చెపతున్నారు. నిరసనకారుల ఆడియా రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బాటిల్స్, కర్రలు, రాడ్లతో దాడులు చేయాలని రెచ్చగొట్టినట్టు విచారణలో తేలింది.
ఏపీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సుబబమారావు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని ఆర్మీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అగ్నిపథ్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సుబ్బారావుతో పాటు మరికొంతమంది కలిసి నిరసనలకు ప్లాన్ చేశారు. యూపీ తరహాలో రైల్వే స్టేషన్లలో ఆందోళనలు చేయాలని సోషల్ మీడియా గ్రూపుల్లో చర్చించారు. తర్వాత పెట్రోల్ తెచ్చి తగులపెట్టాలని మాట్లాడుకున్నట్లు ఫోన్ రికార్డులు బయటికి వచ్చాయి. ఇందులో 26 మంది అభ్యర్థులు కీ రోల్ పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
10 కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆందోళనకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఏపీ గుంటూరు నుంచి వచ్చిన 450 మంది వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వీరే మొదట దాడికి దిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనలో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులే ఎక్కువ మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఘటనకు ముందు రోజు రాత్రే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇతనిక మొత్తం 9 డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు గుర్తించారు.
అల్లర్లలో గుంటూరు, మంచిర్యాల, కరీంనగర్ , వరంగల్ , నిజామాబాద్ , మహబూబ్ నగర్ విద్యార్థులు ఉన్నట్టుగా తేల్చారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులు జరపాలని తాము ఎవరిని కోరలేదన్నారు డివిజినల్ మేనేజర్ గుప్తా. లోకల్ పోలీసులే కాల్పులు జరిపారన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకే కాల్పులు జరిపారని చెప్పారు. ఆందోళనకారుల దాడిలో మొత్తం నాలుగు ప్లాట్ ఫాంలు తీవ్రంగా ధ్వంసమయ్యాయన్నారు రైల్వే డివిజినల్ మేనేజర్ ఏకే గుప్తా.
స్టేషన్లో జరిగిన దాడుల్లో గాయపడిన 13 మంది యువకుల్లో ఐదుగురికి సర్జరీలు చేశామని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. వీరి బాడీ నుంచి రబ్బర్ బుల్లెట్లు తొలగించామన్నారు. మిగిలిన 8 మంది పరిస్థితి బాగానే ఉందన్నారు. మరో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను బాగు చేస్తున్నారు అధికారులు. దెబ్బతిన్న ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్ తొలగించి కొత్తవి ఫిట్ చేస్తున్నారు. మొత్తం 350 ఫ్యాన్లు, వందల సంఖ్యలో లైట్లు పగిలిపోయినట్టు చెబుతున్నారు రైల్వే అధికారులు. 2 కోట్లకు పైగా పార్సిల్ నష్టం జరిగిందంటున్నారు.