కల్తీ విత్తనాలకు చెక్​పడేనా!?.. సరిహద్దు చెక్ పోస్టులపై ఆఫీసర్ల నజర్​ ​ 

కల్తీ విత్తనాలకు చెక్​పడేనా!?.. సరిహద్దు చెక్ పోస్టులపై ఆఫీసర్ల నజర్​ ​ 
  • తనిఖీకి ప్రత్యేక టాస్క్​ఫోర్స్​టీం ఏర్పాటు
  • బ్లాక్​మార్కెట్ కు వెళ్లుతున్న డిమాండ్​ ఉన్న విత్తనాలు 
  • కొరియర్,​ ట్రాన్స్​పోర్ట్ ద్వారా తరలిస్తున్నట్టు గుర్తింపు 
  • షాపుల్లో రెగ్యులర్ గా టాస్క్ ఫోర్స్ తనిఖీలు
  • సరిహద్దు చెక్ పోస్టులపై ఆఫీసర్ల నజర్​ ​ 

ఖమ్మం, వెలుగు: పంట కాలం మొదలవుతుందంటే కల్తీ, నకిలీ విత్తనాలే అసలువి అంటూ వ్యాపారులు, ఏజెంట్లు రైతన్నపై ఒత్తిడి తెస్తారు. కాగా అక్రమాలకు ప్రస్తుతం టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు, పోలీసులు చెక్​ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఆఫీసర్ల టాస్క్​ఫోర్స్​  టీమ్​ ఇటీవల ఖమ్మం నగరంలోని విత్తన షాపులపై దాడులు చేసింది. సుందర్​ టాకీస్ ​రోడ్​లోని అగ్రిహట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్​షాపులో తనిఖీ చేయగా అత్యధిక డిమాండ్​ఉన్న యూఎస్7069 అనే రకం పత్తి విత్తనాలను అక్రమంగా బెంగళూరుకు తరలించినట్టు గుర్తించారు. దాదాపు 3వేల విత్తన ప్యాకెట్ల విలువ రూ.25.60 లక్షలు ఉంటుందని ఆఫీసర్లు లెక్కగట్టారు. ట్రాన్స్ పోర్ట్ ద్వారా కర్ణాటకకు తరలించినట్టు ఎంక్వైరీలో తేలింది. దీనిపై టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విత్తన డిస్ట్రిబ్యూటర్​మీద కేసు నమోదు చేశారు. 

జిల్లాపై స్పెషల్​ ఫోకస్​...

జిల్లాలో నకిలీ, కల్తీ విత్తనాలకు చెక్​పెట్టేందుకు ఆఫీసర్లు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏటా కొందరు వ్యాపారులు రాత్రివేళల్లో గ్రామాల్లో రైతులకు నేరుగా విత్తనాలు అమ్మేందుకు తిరుగుతుంటారు. దళారులు, గ్రామాల్లో ఉండే పెద్ద రైతులతో పరిచయాలు పెంచుకుని, బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లను చూపిస్తూ కల్తీ విత్తనాలను అంటగడుతుంటారు. ఇదే సమయంలో కొందరు షాపులు నిర్వహించే లైసెన్స్ దారులు కూడా డబ్బుల కోసం ఇలాంటి దందాలు చేస్తుంటారు. వాటిని కొనుగోలు చేసిన రైతులు పంటకు పూత రాక, కాయలేక, చివరకు మోసపోయామని గుర్తిస్తుంటారు. ఇది ఏటా రొటీన్ గా జరిగేదే. అయితే ఇలాంటి తంతుకు ఈసారి ఆఫీసర్లు బ్రేక్​పెట్టినట్టే కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు, పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​టీమ్​ల తనిఖీలు, రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా అధికారులు రైతులను చైతన్య పరిచే ప్రయత్నం చేస్తున్నారు. 

చెక్​పోస్టుల వద్ద గట్టి నిఘా...

ఖమ్మం జిల్లాను ఆనుకొని ఏపీ, ఛత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దులున్నాయి. ప్రధానంగా ఏపీ నుంచి జిల్లాలోకి ఫేక్​సీడ్స్​ రాకుండా చెక్​పోస్టుల వద్ద నిఘా పెంచారు. అయితే వాహనాల ద్వారా కాకుండా వ్యాపారులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కొరియర్, ట్రాన్స్ పోర్టు ద్వారా విత్తనాలను పంపిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలోనూ ఇదే తరహాలో ఓ ఘటన వెలుగు చూసింది. డిమాండ్​ఉన్న కంపెనీ విత్తనాలను ట్రాన్స్ పోర్ట్ ద్వారా బ్లాక్​మార్కెట్ కు తరలించినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది ముదిగొండ మండలంలో కొందరు రైతులు నకిలీ మక్క విత్తనాలు పెట్టడంతో దాదాపు30 ఎకరాల్లో పంట నష్టపోయారు. దీంతో ఈసారి అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ ఆఫీసర్లు, పోలీసులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్ష జరిగింది. ఆ తర్వాత డివిజన్ల వారీగా పోలీసులు కూడా మీటింగ్స్​పెట్టి విత్తన షాపుల్లో అవకతవకలు జరగకుండా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు రికార్డుల తనిఖీ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు నేరుగా గ్రామాల్లో విత్తనాలు అమ్మకుండా కట్టడి చేయగలిగితే సక్సెస్​అయినట్టేనని ఆఫీసర్లు భావిస్తున్నారు. 


ఈసారి ఆ సమస్య లేకుండా చర్యలు..

తమ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, పోలీసులతో టాస్క్ ఫోర్స్​టీమ్​లను ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. కొరియర్ల ద్వారా, ట్రాన్స్​పోర్ట్ ద్వారా సప్లయ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నాం. రెగ్యులర్ గా షాపుల్లో తనిఖీలు చేస్తున్నాం. గ్రామాల్లో నేరుగా ఎవరు వచ్చినా విత్తనాల బిల్లు లేకుండా కొనుగోలు చేయవద్దని రైతు వేదికల్లో మీటింగ్ పెట్టి అవగాహన కల్పిస్తున్నాం.
- విజయనిర్మల, జేడీఏ, ఖమ్మం