- బీజేపీ సీనియర్ నేత విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యలు.. ఆయన నీచ సంస్కారాన్ని, కాంగ్రెస్ సంస్కృతిని వెల్లడిసున్నాయని విజయశాంతి కామెంట్ చేశారు. రాష్ట్రపతి ముర్ముని చూసి యావత్ దేశం గర్విస్తోందన్నారు.
ఆమెపై కాంగ్రెస్ ఓర్వలేని తనం బట్టబయలైందని విమర్శించారు. నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్న అధిర్ రంజన్.. మరెందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. నిజంగా మహిళల పట్ల కాంగ్రెస్ ఎంపీకి గౌరవముంటే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజలు అసహ్యించుకునేలా ఉందని విజయశాంతి మండిపడ్డారు.