
తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రవిగుప్తా స్థానంలో డీజీపీగా నియమితులయ్యారు జితేందర్. పంజాబ్ జలంధర్ లో రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు. ముందుగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు.
తర్వాత ఢిల్లీ సీబీఐలో, 2004 నుంచి 06 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ లో బాధ్యతలు నిర్వర్తించారు.
హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. దాదాపు 14 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు జితేందర్.