లోక్​సభ ఎన్నికల్లో సీనియర్లం పోటీ చేయం

లోక్​సభ ఎన్నికల్లో సీనియర్లం పోటీ చేయం
  •  ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు, కుతంత్రాలేం చేయం 
  • గవర్నర్​ కోటాలో కోదండరామ్​ ఎలా ఫిట్ ​అవుతరు
  • దాసోజు శ్రవణ్ పొలిటికల్ ​లీడర్ ​అయితే.. కోదండరామ్ పార్టీ అధ్యక్షుడు కాదా?
  • కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనం
  • మీడియా చిట్​చాట్​లో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్


హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో తనతో సహా బీఆర్ఎస్​ సీనియర్లెవరూ పోటీ చేయరని ఆ పార్టీ​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ అన్నారు. కేసీఆర్​పోటీ చేస్తారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిలో కొందరు సానుభూతి వర్కవుట్​అయి ఎంపీలుగా గెలుస్తామనే భావనలో ఉన్నారన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. పార్టీ నుంచి ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది ఆశావహులు ఉన్నారని.. వారిలో సమర్థులను పార్టీ చీఫ్​ కేసీఆర్​అభ్యర్థులుగా ప్రకటిస్తారని తెలిపారు.

తాము ఎమ్మెల్యేలుగా రాష్ట్రంలోనే కొనసాగుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, కుతంత్రాలు చేయబోమన్నారు. గవర్నర్​కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ ​కోదండరామ్​ఎలా ఫిట్​అవుతారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రొఫెసర్ ​శ్రవణ్​కుమార్​ను బీఆర్ఎస్​ప్రభుత్వం గవర్నర్​కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్​చేస్తే.. ఆయన ఫిట్​కారని ఆమోదించని గవర్నర్​ఒక పార్టీ అధ్యక్షుడైన  కోదండరామ్ నియామకానికి ఎలా ఆమోదం తెలుపుతారని కేటీఆర్​ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు.

కేసీఆర్​ఫాం హౌస్​లో స్టిక్​సహాయంతో నడక ప్రాక్టీస్​చేస్తున్నారని, శుక్రవారం ఆయన అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నామని తెలిపారు. శనివారం పార్టీ మైనార్టీ విభాగం సమావేశం, అదే రోజు నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి పదో తేదీ వరకు రోజుకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి ఒక సీనియర్ లీడర్ ఒక్కో నియోజకవర్గానికి వెళ్తారని తెలిపారు.

27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గం వర్గాల సమావేశాలు, 28న వర్ధన్నపేట, మెదక్, సిరిసిల్ల, ముషీరాబాద్, పాలకుర్తి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మిగతా నియోజకవర్గాల సమావేశాల షెడ్యూల్​త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

సీఎం రేవంత్ ​క్షమాపణ చెప్పాలే

కాంగ్రెస్​ ప్రభుత్వం రైతు భరోసా ప్రారంభించిందని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ​డిమాండ్ ​చేశారు. సీఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపైన అసత్యాలు చెప్పారన్నారు. 45 రోజుల రేవంత్​ పాలనలో ఢిల్లీ పర్యటనలు తప్ప సాధించిందేమి లేదన్నారు.  సలహాదారులు వద్దన్న రేవంత్​రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకున్నారని, ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. గతంలో తాను దావోస్​కు పోయినప్పుడు స్విస్​ బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారని, ఆ సమావేశాలు బోగస్ ​అని ఉత్తమ్​లాంటి వాళ్లు మాట్లాడారని, ఇప్పుడు వాళ్లు సీఎం దావోస్ ​పర్యటనపై స్పందించాలన్నారు.

31 వేల మంది సోషల్​ మీడియా కార్యకర్తలతో ‘తెలంగాణ బలగం’

పార్టీ సోషల్​ మీడియాను బలోపేతం చేస్తామని, తెలంగాణ బలగం పేరుతో త్వరలోనే 31 వేల మంది సోషల్​మీడియా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని కేటీఆర్​చెప్పారు. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను పార్టీ పరంగా అదుకుంటామన్నారు. బంగారు తునకలాగా రాష్ట్రాన్ని కాంగ్రెస్​చేతిలో పెట్టామని.. అయినా తమపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్​ అన్నారు.

అధికార పక్షానికి సహనం ఉండాలి

కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని అంటున్నారని, కానీ ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే సహనం అధికార పక్షానికి కూడా ఉండాలని కేటీఆర్​ అన్నారు. పార్లమెంట్​ఎన్నికలు త్వరగానే వస్తాయని అంటున్నారని, ఆలోగానే ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. బండి సంజయ్​ఎంపీగా కరీంనగర్​కు తెచ్చిన నిధులపై మాజీ ఎంపీ వినోద్​కుమార్​తో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్​చేశారు. 14 అసెంబ్లీ సీట్లను 7 వేల ఓట్ల కన్నా తక్కువ మెజార్టీతో ఓడిపోయామని, తాము కొంత ఎఫెక్టివ్​గా పని చేసి ఉంటే బాగుండేదన్నారు. కేసీఆర్​ను సీఎం చేసుకుందామని పార్టీ క్యాడర్​కు చెప్పానే తప్ప.. రెండేండ్లలోనే అని తాను అనలేదన్నారు. బీఆర్ఎస్​పేరు టీఆర్ఎస్​గా మార్చాలని కార్యకర్తల్లో కొందరు కోరారని, కోలుకున్న తర్వాత దానిపై చర్చిస్తానని కేసీఆర్ చెప్పారని కేటీఆర్​అన్నారు.