‘నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై’ అంటూ మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు సంజయ్ దత్. ఆయన లీడ్ రోల్లో సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ‘ఖల్ నాయక్’ బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో ఒక సంచలనం. 33 ఏళ్ల తర్వాత అదే పవర్ఫుల్ యాంటీ హీరో పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నారు. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో దీనికి సీక్వెల్ వస్తోంది. ముంబైలో జరిగిన ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
1993 నాటి బల్ రామ్ ప్రసాద్ అలియాస్ ‘బల్లు’ క్యారెక్టర్ను గుర్తు చేస్తూ రగ్గడ్ లుక్లో పవర్పుల్ అవతార్లో కనిపించారు సంజయ్ దత్. జియో స్టూడియోస్ జ్యోతి దేశ్పాండే సమర్పణలో సంజూ సొంత నిర్మాణ సంస్థ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్, అక్ష కాంబోజ్కు చెందిన ఆస్పెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఒరిజినల్ మూవీ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో తాను శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ సీక్వెల్ ఆలోచన వచ్చిందని సంజయ్ దత్ చెప్పారు. జైల్లోని 4000ల మంది ఖైదీలను సీక్వెల్ గురించి అడగ్గా వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో పేజీ రాసి ఇచ్చారని ఆ విషయాన్ని సుభాష్ ఘాయ్ గారికి చెప్పానని సంజయ్ దత్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తీస్తున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని సుభాష్ ఘాయ్ అన్నారు. ఇక ఒరిజినల్లో జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్ నటించగా రాబోయే సీక్వెల్లోనూ వాళ్లు ఉంటారా, ఇది ఆ కథకు కొనసాగింపా లేక కొత్త వెర్షనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

