ఖైరతాబాద్, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, గిరిజన బంధు ఇవ్వాలని బంజారా గిరిజన సమాఖ్య(బీజీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్కే మహేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీజీఎస్ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. కాగా వారిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మహేశ్మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని ఏండ్లుగా తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల్లోగా జయంతిపై నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన వారిలో బీజీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరేశ్ నాయక్, నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు అమర్ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.