వరంగల్ జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు

వరంగల్ జిల్లాలో జోరందుకున్న నామినేషన్లు
  • జనగామ జిల్లాలో 7    
  •  వరంగల్ జిల్లాలో 6 
  •  హనుమకొండలో 5

జనగామ అర్బన్, వెలుగు :  జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయని ఎలక్షన్​ ఆఫీసర్, కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు నామినేషన్లు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్, స్టేషన్ ఘనపూర్ నుంచి రెండు నామినేషన్లను రిటర్నింగ్​ ఆఫీసర్లు స్వీకరించారు.

జనగామ నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇండిపెండెంట్​ అభ్యర్థి సాధం మదన్ మోహన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మంతెన నరేశ్​, ఇండియా ప్రజాబంధు అభ్యర్థి గంధమల్ల ఇస్తారీ, పాలకుర్తి నుంచి ఇండిపెండెంట్​ అభ్యర్థి మాధవరెడ్డి వెంకట్​రెడ్డి, స్టేషన్​ ఘనపూర్ నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర, ఆమ్​ ఆద్మీ పార్టీ నుంచి ఆర్నేని ప్రేమ్​ రెడ్డి నామినేషన్​ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. 

పల్లా రాజేశ్వర్​ రెడ్డి భారీ ర్యాలీ.. 

 ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్​ఎస్​ నుంచి పల్లా రాజేశ్వర్​ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జనగామ, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఆప్కో చైర్మన్​ మండల శ్రీరాములులతో కలిసి భారీ ర్యాలీగా ఆయన రిటర్నింగ్​ ఆఫీస్​కు చేరుకుని నామినేషన్ వేశారు. 

హనుమకొండలో ..

హనుమకొండ, వరంగల్, వెలుగు :  హనుమకొండ జిల్లాలోని వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి రావు పద్మ భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోని ఆఫీస్​లో రిటర్నింగ్​ ఆఫీసర్​ ఎల్​.రమేశ్​కు నామినేషన్​ పత్రాలు అందజేశారు. ఆమె వెంట భర్త రావు అమరేందర్​ రెడ్డి, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, దేశిని సదానందంగౌడ్​ తదితరులున్నారు. కాగా ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ తో పాటు ఇండిపెండెంట్ గా పెండెం రాఘవరావు రెండు నామినేషన్లు వేశారు. పరకాల నియోజకవర్గ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా డా.పగడాల కాళీప్రసాద్​, ఇండిపెండెంట్​ గా అందె కుమారస్వామి నామినేషన్​ దాఖలు చేశారు. 

వరంగల్ జిల్లాలో ఆరు 

 వరంగల్​ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మంగళవారం మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సంపేట నియోజకవర్గ స్థానానికి డా.పెంచాల శ్రీనివాస్​ బీజేపీ తోపాటు ఇండిపెండెంట్​ గా నామినేషన్​ వేశారు. పెద్దారపు రమేశ్​ ఎంసీపీఐ(యూ) నుంచి నామినేషన్​ దాఖలు చేశారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సండ్ర జాన్సన్​ ఇండిపెండెంట్​ గా నామినేషన్​ వేశారు. వర్దన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా కేఆర్​ నాగరాజు, బీజేపీ అభ్యర్థిగా కొండేటి శ్రీధర్​ నామినేషన్ దాఖలు చేశారు. 
 
మహబూబాబాద్​లో ఒకే ఒక్క నామినేషన్​ 

మహబూబాబాద్​, వెలుగు :  డోర్నకల్​ అసెంబ్లీ సెగ్మెంట్​కు మంగళవారం ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ డోర్నకల్​ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన భూక్యా నరేశ్​ నామినేషన్​ వేసినట్లు రిటర్నింగ్​ ఆఫీసర్​ నరసింహారావు తెలిపారు. కాగా మహబూబాబాద్​ అసెంబ్లీ సెగ్మెంట్​కు ఎటువంటి నామినేషన్లు స్వీకరించలేదని ఆఫీసర్లు తెలిపారు.

 ములుగులో నామినేషన్​ వేసిన స్వతంత్ర అభ్యర్థి సమ్మక్క

ములుగు :  అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు మహబూబాబాద్​ జిల్లా గంగారం గ్రామానికి చెందిన వజ్జ సమ్మక్క స్వతంత్రఅభ్యర్థిగా మంగళవారం నామినేషన్​ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పీవో అంకిత్ కు తన నామినేషన్​ పత్రాలను అందజేశారు. సీపీఐ(ఎంఎల్)​ న్యూడెమోక్రసీ నాయకులు సమ్మక్కను బలపరిచారు. ఇప్పటివరకు మొత్తం 2మాత్రమే నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.