ద్రవ్యలోటు భర్తీకి ప్రభుత్వం నుంచి మరిన్ని ప్యాకేజీలు?

ద్రవ్యలోటు భర్తీకి ప్రభుత్వం నుంచి మరిన్ని ప్యాకేజీలు?

న్యూఢిల్లీబడ్జెట్‌‌ లోటును పూడ్చడానికి ప్రభుత్వానికి ఆర్థికసాయం చేయాలనే ప్రపోజల్‌‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంత దాస్‌‌ అన్నారు. కరోనాతో వచ్చిన ఇబ్బందుల వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయిన సంగతి తెలిసిందే. జీడీపీలో ద్రవ్యలోటును 3.5 శాతానికి పరిమితం చేయాలన్న టార్గెట్‌‌ను ప్రస్తుత పరిస్థితుల్లో చేరుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇబ్బందులు పడుతున్న జనాన్ని, వ్యాపారాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని ప్యాకేజీలను ప్రకటించడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఇది వరకే ఈ విషయం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.  ద్రవ్యలోటుపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నానని దాస్‌‌ వివరించారు. ఖర్చులను తగ్గించడానికి ఇది వరకే ఉద్యోగుల డీఏను ప్రభుత్వం ఆపేసింది. జీతాల్లో కోత పెట్టింది. బలహీనవర్గాల కోసం సహాయక ప్యాకేజీని కూడా ప్రకటించింది. వారికి ఉచితంగా ఆహారం, నగదు ఇస్తోంది. ఇలాంటి కార్యక్రమాల కోసం జీడీపీలో 0.8 శాతం ఖర్చు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందని ఆర్‌‌బీఐ బాస్‌‌ చెప్పారు.  కరోనా కారణంగా గత నెల 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్‌‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తలెత్తిన తరువాత తొలిసారిగా ‘కో జెనిసెస్‌‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే…

ద్రవ్యలోటుపై…

లాక్‌‌డౌన్‌‌ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గినందున ద్రవ్యలోటు టార్గెట్‌‌ను ప్రభుత్వం ఇంకా పెంచాలని ఇది వరకే పలువురు ఎకనమిస్టులు, ఆర్‌‌బీఐ మాజీ గవర్నర్లు సూచించారు. జీఎస్టీ ఆదాయం కూడా భారీగా తగ్గుతుంది. డైరెక్ట్‌‌ ట్యాక్సుల రాబడీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి.  ఎఫ్‌‌ఆర్‌‌బీఎం కమిటీ రిపోర్టు ప్రకారం ఫిస్కల్‌‌ ప్యాకేజీ ఉంటుంది. ద్రవ్యలోటును తగ్గించడానికి అడ్‌‌ హాక్ ట్రెజరీ బిల్స్‌‌ను తొలగించాం. ఫిస్కల్‌‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌‌ బడ్జెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (ఎఫ్‌‌ఆర్‌‌బీఎం) చట్టాన్ని తెచ్చాం. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌‌ లోటును పూడ్చడంపై వెంటనే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. రాబోయే పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తాం. మా సంస్థ బ్యాలెన్స్‌‌షీటును మరింత బలోపేతం చేస్తాం. స్థూల ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎక్కువ ఇంపార్టెన్స్‌‌ ఇస్తాం.

రెపోరేటుపై…

మార్కెట్‌‌కు మరింత క్యాష్‌‌ అందించడానికి ఆర్‌‌బీఐ మూడు వారాల్లో రెపో రేటును 115 బేసిస్‌‌ పాయింట్లు తగ్గించింది. అయితే ఇదే పద్ధతి ఇక నుంచి కూడా ఉంటుందని మార్కెట్లు అనుకోకూడదు. అయితే ఈ రేటు మా ఆర్థిక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌‌కు ఎక్కువ క్యాష్‌‌ను పంపించాలి కాబట్టే రెపోరేటును తగ్గిస్తున్నట్టు ఈ నెల 17న ప్రకటించాం. మానిటరీ పాలసీ కమిటీ పర్మిషన్‌‌ లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు తప్పు. కమిటీ ఒప్పుకున్నాకే రేటును తగ్గించాం. దానికి అన్ని విషయాలనూ వివరించాం.

కరోనా కష్టాల నుంచి బయటపడతాం

కరోనా వల్ల వచ్చిన ఆపదల నుంచి గట్టెక్కించడానికి ప్లాన్లను తయారు చేయడం చాలా ముఖ్యం. ద్రవ్యలోటు, లిక్విడిటీ (క్యాష్‌‌ అందించడం), ఇతర ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగాఉండాలి.  ఇటువంటి కష్టకాలం మనకు టెస్టింగ్‌‌ టైమ్‌‌ వంటిది. ఇప్పుడు నిలదొక్కుకోగలిగితేనే రిజర్వు బ్యాంకు బలంగా ఉన్నట్టు లెక్క అని దాస్​ చెప్పారు.

కోవిడ్‌‌ బాండ్స్‌‌పై నిర్ణయం తీసుకోలేదు

క్యాష్‌‌ను ఇంకా పెంచడానికి కోవిడ్‌‌ బాండ్స్‌‌ పేరుతో లాంగ్‌‌ మెచ్యూరిటీ బాండ్స్‌‌ తేవాలనే ప్రపోజల్స్‌‌ ఉన్నాయి. దీనిపై మేం ఇంకా ఏమీ అనుకోలేదు. సమయం వచ్చినప్పుడు ఆచితూచి అడుగువేస్తాం. చిన్న, మధ్యతరహా ఎన్‌‌బీఎఫ్‌‌సీలు, మైక్రోఫైనాన్స్ కంపెనీలకు క్యాష్‌‌ అందుబాటులో ఉండేలా చూస్తాం. అవసరాన్ని బట్టి ఎల్‌‌టీఆర్‌‌ఓ, టీఎల్‌‌టీఆర్‌‌ఓల వంటి మరిన్ని లిక్విడిటీ టూల్స్‌‌ తెస్తాం.