- చెన్నైలో నేడు అంత్యక్రియలు
చెన్నై: ప్రముఖ హాస్య నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ తల్లి కన్నుమూశారు. సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. సుధాకర్ తల్లిదండ్రులు సూరావజ్జల కృష్ణారావు, ఎస్ఎస్ కాంతం చెన్నై మహాలింగపురంలో సుధాకర్ నివాసంలో ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం, వృద్ధాప్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తు వైజాగ్లో ఉంటుండగా, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు. కాంతం అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం చెన్నైలో జరుగనున్నాయని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. సుధాకర్ తల్లి కాంతం.. ఎస్పీ శైలజకు స్వయానా మేనత్త కూడా కావడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.