టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు లైన్ క్లియర్ అయింది. గిల్ గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు దూరం కానున్నాడు. దీంతో స్వదేశంలో సఫారీలతో జరగనున్న వన్డే సిరీస్ లో జైశ్వాల్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం ఖాయంగా మారింది. రోహిత్ శర్మతో కలిసి ఈ ముంబై ఓపెనర్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. ఇప్పటివరకు జైశ్వాల్ ఒకటే వన్డే మ్యాచ్ ఆడాడు. గిల్ ఈ సిరీస్ లో ఆడకపోవడంతో జైశ్వాల్ వన్డే టాలెంట్ పై కూడా ఒక క్లారిటీ వస్తోంది. బ్యాకప్ ఓపెనర్ గా అభిషేక్ శర్మకు ఛాన్స్ దక్కొచ్చు. అభిషేక్ శర్మ టీ20ల్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. వన్డే క్రికెట్ లో అవకాశం వస్తే నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
రాహుల్ కే కెప్టెన్సీ:
మెడ గాయం కారణంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఒకవేళ గిల్ కోలుకోకపోతే అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ భారత జట్టును నడిపించాల్సి ఉంది. అయితే శ్రేయాస్ కూడా గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతూ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ ఆదుకునే క్రమంలో అయ్యర్ డైవ్ చేయడంతో అతని పక్కటెముకలకు గాయమైంది. గాయంతో ఇబ్బందిపడుతున్న శ్రేయాస్ ఈ నెలాఖరులోగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.
రిపోర్ట్స్ అయ్యర్ కు మరో నెల రోజుల పాటు రెస్ట్ కావాలని సూచిస్తున్నాయి. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ లేకపోవడంతో ఇప్పుడు భారత జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించే చాన్స్ ఉంది. అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ కూడా టీమ్లో ఉండటం వల్ల అతనికే నాయకత్వ పగ్గాలు అప్పగించొచ్చనే వార్తలు వస్తున్నా రాహుల్ కే సారధ్య బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టుల్లో కెప్టెన్సీ చేస్తున్న పంత్ కూడా రేస్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
►ALSO READ | IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా ముత్తుసామి, వెర్రెయిన్.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
‘గిల్ మెడ గాయానికి సంబంధించిన వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ముంబైలో ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నాడు. కండరాల గాయమా, నరాల సంబంధిత సమస్యా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే అతనికి ఎక్కువ విశ్రాంతి అవసరమని నిర్ధారించారు. రిపోర్ట్స్ తర్వాత చికిత్సపై నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ ఫిట్నెస్తో వన్డే సిరీస్లో గిల్ ఆడటం అసాధ్యం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు గిల్ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సఫారీలతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.
హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్ పేస్ బాధ్యతను పంచుకోనున్నారు. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న హార్దిక్ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. కుల్దీప్కు రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, సుందర్కు స్పిన్ బాధ్యతలు ఇవ్వొచ్చు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు జట్టును ఆదివారం (నవంబర్ 23) ప్రకటించే అవకాశం ఉంది.
