న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్.. బీసీసీఐ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక కానున్నాడు. ఈ మేరకు ఆదివారం జరిగే బోర్డు వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో అతను ఈ పురస్కారం అందుకోనున్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్కు ఎంపిక కాకపోయినా.. టెస్ట్, వన్డే ఫార్మాట్లో గిల్ అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపెట్టాడు. టెస్ట్ల్లో 983 రన్స్ సాధించాడు.
గతేడాది ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో 70 సగటుతో ఏకంగా 754 రన్స్ చేశాడు. వన్డేల్లో 490 రన్స్ సాధించిన గిల్.. చాంపియన్స్ ట్రోఫీలో 188 పరుగులతో సత్తా చాటాడు. మొత్తం మీద ఈ రెండు ఫార్మాట్లలో గిల్ 49 సగటుతో రన్స్ చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో గిల్ ఫామ్లో లేకపోయినా.. ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 50 సగటుతో 650 రన్స్ చేశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను ‘కల్నల్ సీకే నాయుడు’ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ను గెలిపించడంతో పాటు ఇండియా క్రికెట్కు చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డును ప్రకటించారు. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఉత్తమ అసోసియేషన్గా ఎంపికకానుంది.
