
- సంరక్షణ ప్రభుత్వానికి చేతకాకుంటే.. బీఆర్ఎస్కు అప్పగించండి
- మాజీమంత్రి హరీశ్రావు
మెదక్/నర్సాపూర్, వెలుగు : వేములవాడ గోశాలలో కోడెలు చనిపోవడం రాష్ట్రానికి అరిష్టం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. కోడెల మరణాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. కోడెలు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్నారు.
కోడెలకు గడ్డి సమకూర్చే పరిస్థితి కూడా లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే.. బీఆర్ఎస్కు అప్పగిస్తే తాము కాపాడుకుంటామన్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్తో ఒకరు చనిపోవడం దారుణం అన్నారు. రైతుబంధు కింద ఎకరాకు రూ. 18 వేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు. వడ్లకుప్పల మీదే రైతులు చనిపోతున్నారని, వారి కుటుంబాలను సీఎం గానీ, మంత్రులు గానీ పరామర్శించకపోవడం దుర్మార్గం అన్నారు. రైతు బీమా ప్రీమియం కట్టకపోవడం వల్లే రైతులకు ఆర్థికసాయం అందడం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ప్రజలన్నా, దేవుళ్లన్నా లెక్క లేదన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ రాసిచ్చి మరీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావును అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నమే తప్ప.. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదన్నారు. ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉన్నారు.