శ్రావణమాసం..అమ్మవారికి... కార్తీకమాసం శివకేశవులకు.. ఎంతో ఇష్టం.. అలాగే ధనుర్మాసం.. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో మహాలక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తారు. మరి ఈ ఏడాది (2025) ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది.. ధనుర్మాసం విశిష్టత ఏమిటి.. ధనుర్మాసం నెలరోజులు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులూ ధనుర్మాసమని పండితులు చెబుతున్నారు. ఈనెల రోజులు తెల్లవారుజామున కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంచే ఏదో ఒకదానికోసం ప్రార్థించడం. ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవన్నీ ద్రవిడుల సంప్రదాయాలు. ఈ నెలరోజులు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.
2025డిసెంబర్ 16 ( 12 గంటల 58 నిమిషాల) నుంచి 2026 జనవరి 14( రాత్రి 9.11 గంటల) వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ధనుర్మాసం శనితో సంబంధం ఉన్న మాసం. మార్గశిరలో ప్రారంభమై పుష్య మాసం వరకు ఉంటుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారు
ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది.
ధనుర్మాసం.. సాధారణంగా దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదీ నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహ ప్రవేశం, నిశ్చితార్థం, వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి కావడమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ధనుర్మాసంలో విష్ణువును పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. విష్ణు భక్తులకు ఈ నెల కాలం ( 2025 డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు) అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30) వేలాది మంది భక్తులు విష్ణుపూజ చేస్తారు.
ఈ నెల ( ధనుర్మాసం) మొత్తం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాలు ముగించుకుని వేకువజామున పూజలు ప్రారంభించి, సూర్యోదయానికి ముందే పూజలను ముగిస్తారు. దీనిని ధనుర్ పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రివేళ, ఉత్తరాయణం పగలు, అయితే ఈ ధనుర్మాసం రాత్రి, పగలు రెండూ కలగలిసి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి, స్వామిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు .
దరిద్రాలను దూరం చేసే లక్ష్మీ పూజ
పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల శుభం కలుగుతుందని హిందువులు నమ్ముతుంటారు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

