శివ పూజలో మారేడు దళానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నదో తెలుసా..

శివ పూజలో మారేడు దళానికి ఎందుకు  అంత ప్రాముఖ్యత ఉన్నదో తెలుసా..

హిందూ శాస్త్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. ఆరోజు శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలతో ఇలా పూజిస్తే ఘోరమైన పాపాలన్నీ తొలగిపోతాయి. మీ కోరికలన్నీ తీరతాయి.మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం జరుపుకునే అతి పెద్ద పండగలలో మహా శివరాత్రి ఒకటి. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి జరుపుకోనున్నారు . ఈరోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వపత్రాలు. వీటిని మారేడు దళాలు అని కూడా అంటారు. విష్ణుమూర్తి అలంకారి ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం. అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వ దళాలతో ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిండిపోతుంది. సమస్యల నుంచి బయట పడేందుకు బిల్వపత్రాలతో ఈ విధంగా చేయండి.

బిల్వపత్రాలతో ఇలా చేస్తే కోరికలు తీరతాయి

శివాలయం సందర్శించి అక్కడ ఉన్న బిల్వ చెట్టు కింద ఏదైనా గులకరాయని శివుని ప్రాతినిధ్యంగా నమ్మి పూజించాలి. ఈ గులకరాయికి నీరు, బియ్యం, పచ్చి శనగలు సమర్పించాలి. ఓం నమః శివాయ అని పఠిస్తూ శివుడికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేయాలి.

శివుడి ఆశీర్వాదం పొందడానికి బిల్వ చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి సరైన ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి. ఆర్థిక సమస్యలు నుంచి బయట పడేందుకు వీటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శివుడికి బిల్వ పత్రాలు అంటే మహా ప్రతీతి. అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది.

పురాణాల ప్రకారం ఒక రోజు పార్వతి దేవి మందరాచల్ పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు ఆమె చెమట చుక్కలు పర్వతంపై పడ్డాయి. వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని చెబుతారు. గిరిజాదేవి రూపంలో పత్ర చెట్టు వేరులో ఉంటుందని, మహేశ్వరి దేవి రూపం నారలో ఉంటుందని, దక్షిణాయన దేవీ రూపం కొమ్మలలో ఉందని, పార్వతి దేవి రూపం బిల్వపత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.

కాత్యాయనీ దేవి, గౌరీ దేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు. బిల్వపత్రంలో పార్వతి దేవి ఉండటం వల్లే పరమ శివుడికి మారేడు ఆకులు అంటే మహా ఇష్టమని చెప్తారు. శివ పూజలో బిల్వపత్రాల సమర్పించడంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాన్ని దర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు.

ఇంట్లో మారేడు చెట్టు ఉంటే కలిగే ప్రయోజనాలు

శివుడిని పూజించేటప్పుడు “ఏక బిల్వం శివార్పణం” అంటూ మారేడు దళాలు సమర్పిస్తారు. ఈ ఆకులతో పూజిస్తే ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతాయని అంటారు. సాధారణంగా ఒకసారి పూజకు ఉపయోగించిన వస్తువులు ఏవి మరొకసారి ఉపయోగించరు.కానీ బిల్వ పత్రాలను పూజకి ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రాలు వాడిపోయినప్పటికీ పూజ చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి.

శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు. అందుకే ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవిస్తారు. పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని, దక్షిణం వైపు ఉంటే యమ బాధలు తీరిపోతాయని విశ్వసిస్తారు.


ఏకబిల్వం శివార్పణం' అని మారేడు దాళలలతో శివుడిని పూజిస్తారు...పరమేశుడి పూజలో బిల్వదళానికి ఎందుకంత ప్రాముఖ్యతో ఈ శ్లోకంలో ఉంది...

బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రం దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశిస్తే సర్వపాపములు నశిస్తాయి.  భక్తిశ్రధ్ధలతో బిల్వ దళాన్ని అర్పిస్తే  ఘోరాతిఘోరమైన పాపాలు తొలగిపోతాయి. అలాంటి త్రిగుణము గల  బిల్వదళమును నీకు అర్పిస్తున్నాను...నన్ను అనుగ్రహించు పరమేశా అని అర్థం..

శివుడు సృష్టించిన బిల్వవృక్షం

మరో కథనం ప్రకారం పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!' అని కేకలు వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి...శక్తికి సమర్పించాలి అనుకుంది. అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అమ్మవారిని వారించి... విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు...నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయనే వరమిచ్చాడు.ఆ సమయంలో లక్ష్మీదేవి నివేదిత స్థలం అయిన హోమగుండం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు..అదే బిల్వవృక్షం. ఈ దళాలతో తనను పూజిస్తే అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని చెప్పాడు శివుడు. అలా పరమేశ్వరుడి సేవకోసమే బిల్వవృక్షం భూలోకంలో పుట్టిందని చెబుతారు. 

త్రిశూలానికి సంకేతం మారేడు దళం

మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి..మూడు ఆకులతో ఉన్నందునే త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాల్లో ఉంది.  శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే మారేడు విశిష్టత, శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు వివరంగా ఉంటాయి. మారేడు చెట్టు మొదట్లో దీపం వెలిగించిన వారికి  తత్వజ్ఞానం లభిస్తుంది. మరణానంతరం శివ శాయుజ్యం పొందుతారు. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను ముట్టుకోవడం, పూజించటం వల్ల సకలపాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
  
వాడినా పర్వాలేదు 3 రేకులు తప్పనిసరి

శివార్చనకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించాలి. ఓసారి కోసిన బిల్వపత్రములు సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటుంది. బిల్వదళాలు వాడిపోయినా పర్వాలేదు కానీ మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఏకబిల్వ పత్రంలో మూడు రేకులలో ఎడమవైపు ఉన్నది బ్రహ్మ, కుడివైపున్నది శ్రీ మహావిష్ణువు, మధ్యలో ఉన్నది సదాశివుడుని చెబుతారు.

బిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం..త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః..శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే..శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్..సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ..కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం..బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం..అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం..ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే..అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

ఫలశృతి

బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ..సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్