మార్చి 6న విజయ ఏకాదశి.. ఆరోజున ఏ దేవుడిని ఎలా పూజించాలంటే..

మార్చి 6న విజయ ఏకాదశి.. ఆరోజున ఏ దేవుడిని ఎలా పూజించాలంటే..

హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున  ( మార్చి 6) విష్ణువును పూజిస్తారు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మార్చి 6న విజయ ఏకాదశి. ఈ రోజున చాలా మంది విష్ణువును పూజిస్తారు ? విష్ణువును ఎలా పూజించాలి? ఎలాంటివి చేయకూడదో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం .


ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి.మాఘ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీన విజయ ఏకాదశి జరుపుకొనున్నారు. ఏకాదశికి హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున మహా విష్ణువుని పూజించి ఉపవాసం ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శుభ ముహూర్తం

విజయ ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 6 ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై ఏకాదశి తిథి మార్చి 7 ఉదయం 4:13 గంటలకు ముగుస్తుంది.

ఏకాదశి వ్రతం విధానం

తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి. వీలుపడని వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో పీట వేసి దానిమీద పసుపు వస్త్రం పరిచి విష్ణు విగ్రహాన్ని పెట్టాలి. పంచామృతం, గంగా జలంతో విష్ణువుని అభిషేకించాలి. పసుపు గంధం, పసుపు పువ్వులు సమర్పించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ధూపం, పండ్లు, నైవేద్యం, తులసి ఆకులు భోగంగా సమర్పించాలి. తర్వాత విష్ణు సహస్రనామం పఠించాలి. విజయ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది.

విజయ ఏకాదశి ప్రాముఖ్యత

విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు, చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో కలిగించిన వాటి నుంచి బయటపడగలుగుతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు

  • ‘ఓం నారాయణాయ లక్ష్మీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు.
  • ‘ఓం సీతాపతే రామ్ రామాయ నమః’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.
  • ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.

ఏకాదశివ్రతాన్ని ఆచరించే వారు కూడా దానాలు చేయాలి. తులసిమాత కూడా ఈరోజు ఉపవాస దీక్ష చేస్తారు. అందువల్ల, ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు పోయడం మంచిది కాదు. సాయంత్రం తులసిమాత పూజ నిర్వహిస్తారు. అయితే, ఈరోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకండి.

ALSO READ :- Mahashivratri Special : త్రివేణి సంగమం.. మన తీర్థాల త్రినేత్రుడు

విజయ ఏకాదశి నాడు బియ్యం, వస్త్రాలు దానం చేయాలి. వాటిని ముఖ్యంగా పేదలకు దానం చేయడం వల్ల సంతోషంతోపాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా, చంద్రుడు మీ జాతకంలో బలపడతాడు మీరు జీవితంలో మీరు కోరుకున్నది సాధిస్తారు. విష్ణువు ముందు మీ ప్రతికూల భావోద్వేగాలను విడిచిపెట్టడానికి ఈ రోజు  ( మార్చి 6) చాలా మంచిది.

ఏకాదశి రోజు చేయాల్సిన పనులు

విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు మీకు వీలయినంతవరకు దానాలు చేసేందుకు ప్రయత్నించండి.

ఏం చేయకూడదు

సనాతన ధర్మం ప్రకారం విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, ఆల్కహాల్, ఉల్లిపాయలు, లేదా వెల్లుల్లి తీసుకోకూడదు. ఏకాదశి తిథి ప్రారంభానికి ముందు రోజు నుంచి వీటిని తీసుకోవడం మానేయాలి.