అనుమానాస్పద స్థితిలో సర్పంచ్​ భర్త మృతి

అనుమానాస్పద స్థితిలో  సర్పంచ్​ భర్త మృతి

కామారెడ్డి, కామారెడ్డి టౌన్​, వెలుగు:  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్​ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ  నర్సాగౌడ్​( 48)  మంగళవారం అనుమానాస్పద స్థితిలో  చనిపోయారు.   వివరాలిలా ఉన్నాయి..   సర్పంచ్​ మహేశ్వరి  కుటుంబం  జిల్లా కేంద్రంలోని ఆశోక్​నగర్​ కాలనీలో ఉంటోంది.  

సోమవారం  విప్​ గంప గోవర్ధన్​ ప్రోగ్రామ్​కు వెళ్లి  ఇంటికి వచ్చిన నర్సాగౌడ్​ సాయంత్రం  7 గంటలకు బయటకు వెళ్లారు.   కొంత సేపటికి ఇంటికి ఫోన్​ చేసి తాను వేరే ఊరిలో  ఫంక్షన్​కు వెళ్తున్నానని  చెప్పారు. రాత్రి అయినప్పటికీ రాకపోవటంతో  కుటుంబసభ్యులు ఫోన్​ చేయగా స్విచ్​ఆఫ్​ వచ్చింది.మంగళవారం  పొద్దున కుటుంబసభ్యులు నర్సాగౌడ్​ కోసం వెతకగా కామారెడ్డి  జిల్లా పోలీసు ఆఫీసుకు  కొద్ది దూరంలో  నిర్మించి వదిలేసిన బిల్డింగ్​ వెనుక డెడ్​ బాడీ,  బైక్​ కనిపించాయి.  

వెంటనే  దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సురేశ్​, రూరల్​  సీఐ  శ్రీనివాస్​గౌడ్​, దేవునిపల్లి ఎస్సై సురేశ్​ డెడ్​బాడీని పరిశీలించారు.  నర్సాగౌడ్​ మృతిపై  గ్రామస్థులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ  డెడ్​బాడీతో ఓ వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.  మృతుడి భార్య ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని,   బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో  ఆందోళన విరమించారు.