
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియాలో నిర్మించిన ఏరియా జనరల్ మేనేజర్ ఆఫీస్, వర్క్షాపును ఎమ్మెల్యే కూనంనే ని సాంబశివరావుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. మైనింగ్ రంగంలో 130ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి ప్రపంచంలోని క్రిటికల్ మినరల్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందన్నారు.
ఇప్పటికే కన్సల్టెన్సీని ఏర్పాటు చేశామన్నారు. రాబోయే 30 ఏండ్ల పాటు ఏటా కొత్తగా ఏర్పాటు చేసినా, చేయనున్న నైనీ ప్రాజెక్టుతో పాటు వీకే 7 ఓసీ, ఇల్లెందు జేకే ఓసీ, గోలేటి ఓసీల నుంచి ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నులకు పైగా కోల్ ప్రొడక్షన్ చేయనున్నామని తెలిపారు. సింగరేణిలో కొత్త మైన్స్రావాల్సి ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ఎన్. బలరాం నాయక్, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించరా అంటూ ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం
స్థానిక ఎమ్మెల్యే పట్ల ప్రోటోకాల్పాటించరా అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి డైరెక్టర్లు, ఆఫీసర్లపై మండిపడ్డారు. తాను అధ్యక్షత వహించే స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనీసం తన ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఎన్ని గంటలకు వస్తున్నారు, ఆలస్యం అవుతుందా, టైంకు వస్తున్నారా అనే ఎలాంటి విషయాలను తన దృష్టికి తీసుకురాకపోవడం దారుణమన్నారు. సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గతంలోనూ సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలోనూ తనను అవమానపర్చే విధంగా సింగరేణి ఆఫీసర్లు వ్యవహరించారని ఫైర్ అయ్యారు. జీఎం ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ఎత్తున స్టేజీ ఏర్పాటు చేశారు. ఆఫీసర్లు, యూనియన్ నేతలంతా వచ్చారు. ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత అర్జంట్ పని అంటూ డిప్యూటీ సీఎం భట్టి వెళ్లిపోవడంతో అందరూ నిరాశ చెందారు. జనం పెద్దగా లేకపోవడంతోనే అసహనంతో భట్టి వెళ్లిపోయారనే ప్రచారం సాగింది.