- రాష్ట్రంలో 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మీథేన్ గ్యాస్ నిల్వలు
- వేలం ద్వారా దక్కించుకునేందుకు కసరత్తు
- టెండర్లలో పాల్గొనాలని సింగరేణికి కేంద్ర పెట్రోలియం శాఖ అధికారుల సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మీథేన్ గ్యాస్ ఉత్పత్తిపై సింగరేణి సంస్థ కన్నేసింది. గోదావరి – ప్రాణహిత లోయలో కోల్ బెడ్ మీథేన్(సీబీఎం) నిల్వలు ఉన్నట్టుగా కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. రాష్ట్రంలో 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మీథేన్ గ్యాస్ నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. దీంతో త్వరలో జరగబోయే వేలంలో దక్కించుకోవాలని సింగరేణి ప్లాన్ చేస్తోంది. వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను ఇటీవల స్వయంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం దేశంలో సహజ ఇంధన వనరుల వినియోగం భారీగా పెరిగినా, మొత్తం నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో సీబీఎం వాటా కేవలం 2 శాతం మాత్రమే. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా 2030 నాటికి దీన్ని 7 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గోదావరి–ప్రాణహిత లోయలో సీబీఏం నిల్వలు
రాష్ట్రంలో మీథేన్ గ్యాస్ నిల్వలు ప్రధానంగా కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) రూపంలో ఉన్నాయి. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లోని గోదావరి–ప్రాణహిత లోయలో ఇవి వ్యాపించి ఉన్నాయి. దేశం మొత్తం మీద సుమారు 92 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల మీథేన్ నిల్వలు ఉండగా రాష్ట్రంలో 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల సీబీఎం నిల్వలు ఉన్నట్టు భారత పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ముఖ్యంగా12 రాష్ట్రాల్లో, ప్రధానంగా ఈస్ట్ ఇండియా పరిధిలోని దామోదర్ -కోయల్ వ్యాలీ, సోన్ వ్యాలీ, ప్రాణహిత -గోదావరి వ్యాలీలో విస్తరించి ఉన్నాయి.
వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ భారతదేశంలో అతిపెద్ద కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) ప్రొడక్షన్ సైట్. ఇక్కడ 2000 సంవత్సరంలోనే ఉత్పత్తి షురూ అయింది. రాష్ట్రంలోని సింగరేణి ఏరియా పరిధిలోకి వచ్చే ఆరు జిల్లాల్లో ఉన్న సీబీఎం నిల్వలను మూడు ప్రధాన బ్లాక్లుగా గుర్తించారు. ఇందులో మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రంభీం జిల్లా బ్లాక్లో 5 బిలియన్ క్యూబిక్ మీటర్లు, కొత్తగూడెంలో 2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్న ప్రాంతాన్ని రెండో బ్లాక్గా.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలో కలిపి 12 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వనరులు ఉన్న ప్రాంతాన్ని మూడో బ్లాక్గా గుర్తించారు. ఈ మూడు బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేలం పాట నిర్వహించనుంది.
మీథేన్ గ్యాస్ ను ఎలా ఉత్పత్తి చేస్తారు ?
మీథేన్ గ్యాస్ ని క్లీన్ ఫ్యూయల్ గా పిలుస్తారు. దీనిని ఎనర్జీ సెక్యూరిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ తయారీలో ఉపయోగిస్తారు. కోల్ బెడ్ ఉత్పత్తి ప్రక్రియ చాలా ప్రత్యేకమైనది. సాధారణ నేచురల్ గ్యాస్ రిజర్వాయర్ల నుంచి తీసే దానికి భిన్నంగా ఉత్పత్తి చేస్తారు. బొగ్గు పొరల్లో కలిసి ఉండే మీథేన్ గ్యాస్ను విభజించి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. బొగ్గు పొరల్లోకి 100 నుంచి 1500 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేసి ఒత్తిడి తగ్గించడానికి ప్రధానంగా డీ–-వాటరింగ్ చేస్తారు.
బొగ్గు పొరల్లోకి నీటిని పంప్ చేసి తీసేయడం ద్వారా ఒత్తిడి తగ్గి మీథేన్ గ్యాస్ విడుదల అవుతుంది. మొదటి దశలో చాలా ఎక్కువ నీరు వస్తుంది. ఆ తర్వాత నీరు తగ్గి గ్యాస్ పెరుగుతుంది. ఇలా గ్యాస్లో 90 శాతం మీథేన్ ఉండేలా సేకరించి వీటిని పైప్లైన్ల ద్వారా నేషనల్ గ్యాస్ గ్రిడ్కు సప్లయ్ చేస్తారు. ఆ తర్వాత అవసరసమైన ఇండస్ట్రీలు, విద్యుత్ ప్లాంట్లు, సీఎన్జీ స్టేషన్లకు సరఫరా చేస్తారు. దీనివల్ల బొగ్గు గనుల్లో సేఫ్టీ పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని కేంద్ర అధికారులు తెలిపారు.
వేలం ద్వారా దక్కించుకునేందుకు సింగరేణి కసరత్తు
దేశంలోని 33 బ్లాక్లలో మీథేన్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలో టెండర్లను పిలిచింది. వీటిలో తెలంగాణలోని 3 బ్లాక్లను దక్కించుకోవడానికి సింగరేణి కసరత్తు చేస్తోంది. బొగ్గు అన్వేషణ లో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరల్లో ఉన్న మీథేన్ గ్యాస్ వనరులను అన్వేషించే సామర్థ్యం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
చమురు, ఇంధన రంగాలను స్వయం సమృద్ధిని సాధించడంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. సింగరేణి ఏరియాలోని ప్రాణహిత-గోదావరి లోయ ప్రాంతంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయ్యేందుకు సింగరేణి ప్రయత్నాలు మొదలుపెట్టింది. టెండర్లలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సంబంధిత శాఖ ఆఫీసర్లు తెలిపారు.
