
హైదరాబాద్, వెలుగు: సింగరేణి మరో వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని నీటి సంపును ఆధారంగా చేసుకొని 500 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో తొలి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మాణానికి తొలి అడుగు వేసింది. దీనికి సంబంధించిన సంపూర్ణ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్కు అప్పగిస్తూ సింగరేణి లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేసింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ..సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పీఎస్పీ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. డిప్యూటీ సీఎం స్వయంగా మేడిపల్లి సంపును సందర్శించి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఈ ప్లాంట్ 40 ఏండ్లపాటు సింగరేణికి ఆర్థిక బలాన్ని చేకూరుస్తుందని, డీపీఆర్ సిద్ధమైన వెంటనే నిర్మాణ టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. ఈ జలవిద్యుత్ ప్లాంట్ మేడిపల్లి సంపులోని 157 మీటర్ల లోతు నీటిని పగటిపూట సోలార్ విద్యుత్తో 2,350 మీటర్ల పొడవు, 23 మీటర్ల లోతున్న రిజర్వాయర్లోకి పంపుతుంది. రాత్రివేళ ఈ నీటిని టర్బైన్ల ద్వారా కిందికి పంపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. రిజర్వాయర్లో 9.64 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేస్తారు. వ్యాప్కోస్ లిమిటెడ్ జియోలాజికల్, హైడ్రాలజీ, పర్యావరణ అధ్యయనాలతో డీపీఆర్ సిద్ధం చేస్తుంది. నిర్మాణ ఖర్చు రూ. 3వేల కోట్లుగా అంచనా వేశారు. నిర్మాణ కాలం, విద్యుత్ అమ్మకాల అవకాశాలను డీపీఆర్లో వివరిస్తారు.