సింగరేణికి కోల్ టాస్క్.. యాజమాన్యం ఆపసోపాలు

సింగరేణికి కోల్ టాస్క్.. యాజమాన్యం ఆపసోపాలు
  • సింగరేణికి ‘కోల్’ టాస్క్
  • టార్గెట్​ రీచ్ ​కావాలంటే రోజుకు 2.27 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి
  • యంత్రాల పని గంటలు పెంచేందుకు యాజమాన్యం చర్యలు
  • గనుల ఏరియాల్లో మల్టీ డిపార్ట్​మెంటల్ ​టీమ్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సింగరేణి యాజమాన్యం ఆపసోపాలు పడుతోంది. 2023–24లో 780 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 560.85 లక్షల టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేసింది. టార్గెట్​రీచ్​అయ్యేందుకు నేటి నుంచి నెలాఖరు వరకు డెయిలీ 2.27లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆఫీసర్లకు సూచించింది. యంత్రాల పని గంటలు పెంచాలని ఆదేశించింది. ఏరియాల వారీగా మల్టీ డిపార్ట్​మెంటల్ టీమ్స్​ఏర్పాటు చేసింది.

ఆ నాలుగు ఏరియాల్లోనే.. 

ఇటీవల సీఎండీగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్​ఫైనాన్స్​ఎన్.బలరాంకు ఉత్పత్తి లక్ష్యాల సాధన పెద్ద టాస్క్​గా మారింది. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు 616.07లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా,  560.85లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఎలాగైనా లక్ష్యానికి చేరుకోవాలని, అండర్ గ్రౌండ్​మైన్లలో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని యాజమాన్యం ప్లాన్​చేస్తోంది.

ఎల్​హెచ్​డీ, ఎస్డీఎల్​యంత్రాల పని గంటలను పెంచుతోంది. మరో వైపు ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా యాజమాన్యం మల్టీ లెవెల్​ డిపార్ట్​మెంటల్​టీమ్స్ ను ఏర్పాటు చేసింది. సింగరేణి పరిధిలోని12 ఏరియాలకుగానూ కొత్తగూడెం, మణుగూరు, మందమర్రి, భూపాలపల్లి ఏరియాలు లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. అత్యధికంగా అడ్రియాలలో 128 శాతం, ఆర్జీ-3 ఏరియాలో 118 శాతం, ఆర్జీ-2 ఏరియాలో 117 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు.