- సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ కోల్బ్లాక్ నుంచి ఈ ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా నిర్దేశించుకుంది. బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్-2 ఓపెన్ కాస్ట్ గని నుంచి 11 మిలియన్ టన్నుల బొగ్గును, కిష్టారం ఓపెన్ కాస్ట్ గని నుంచి 24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
నైనీ బ్లాకులో ఉత్పత్తి చేసే బొగ్గును రోడ్డు మార్గం ద్వారా దగ్గరలోని రైల్వే సైడింగులకు చేరవేయాలని ఆదేశించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి సమీపంలోని రైల్వే సైడింగుల వరకు బొగ్గు రవాణా చేసేందుకు తీసుకుంటున్న చర్యలను జనరల్ మేనేజర్ బైద్య వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

