
- 2021లో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదు
- కరోనా, ఇతర కారణాలతో పెరిగిన డెత్స్
- దేశంలో ఎక్కువగా మరణాలు సంభవించిన 49 జిల్లాల్లో
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకటి
- మహిళలతో పోలిస్తే పురుషుల్లో 30 శాతం అధికం
- ఐక్యరాజ్య సమితి(యూఎన్) పాపులేషన్ రిపోర్ట్ లో వెల్లడి
కరీంనగర్, వెలుగు : మరోసారి కరోనా వ్యాపిస్తోన్న వేళ.. కొవిడ్ సెకండ్ వేవ్ మరణాలపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) పాపులేషన్ రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. 2021లో కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లోని 49 జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయని, ఇందులో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఒకటని ఇటీవల యూఎన్ రిపోర్టు వెల్లడించింది.
అదే ఏడాది సిరిసిల్ల జిల్లాలో జననాల కంటే ఎక్కువగా మరణాలు నమోదైనట్లు గుర్తించింది. ఇది అసాధారణమైన విషయమని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ సెన్సెస్ డిపార్ట్ మెంట్ రూపొందించిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటా ద్వారా వివరాలను ఐక్యరాజ్యసమితి సేకరించి రిపోర్ట్ లో పేర్కొంది.
జననాల కంటే ఎక్కువ..
అదే ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. సీఆర్ఎస్ –- 2021 డేటా ప్రకారం జిల్లాలో 5,028 మంది పుట్టారు. అదేవిధంగా వివిధ కారణాలతో 5,130 చనిపోయారు. ఇందులో ఎక్కువగా కరోనాతోనే చనిపోయారని యూఎన్ రిపోర్ట్ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే సిరిసిల్ల జిల్లాలో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మంది మృతి చెందినట్టు నమోదు కాగా, వీరిలో 1,35,725 మంది పురుషులు, 98,700 మహిళలు ఉన్నారు. ఇందులో పురుషుల మరణాలు మహిళల కంటే దాదాపు 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరణాల నమోదుకు 21 రోజుల సమయం
రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాలను ఆయా స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే.. సీఆర్ఎస్–-2021 డేటా ప్రకారం 75 శాతం మరణాలు 21 రోజుల్లోనే రికార్డైనట్టు వెల్లడైంది. కొన్ని మరణాలు మాత్రం నెలలు, సంవత్సరం తర్వాత కూడా రికార్డు అయ్యాయి.
మధ్య వయసు వాళ్లే అధికం
యూఎన్ రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణలో 65– -69 ఏండ్లలోపు వారు అధికంగా 85,945 మంది, ఆ తర్వాత 70 ఏండ్లు, అంతకంటే ఎక్కువ ఏజ్ వారు 51,516 మంది మరణించారు. 70 ఏండ్ల ఏజ్ పైన మరణాలు సాధారణమని, కానీ మధ్య వయస్కుల్లోనూ మరణాల రేటు గతంతో పోలిస్తే 2021లో పెరిగిందని పాపులేషన్ రిపోర్ట్ లో వెల్లడించింది. 55–-64 ఏండ్ల వయస్సువారు 42,349 మంది మరణించగా, ఇందులో 45– -54 ఏండ్లలోపువారు 22,423 మంది, 35– -44 ఏండ్లలోపు వారు 12,184 మంది చనిపోయినట్లు సీఆర్ఎస్ –-2021 డేటా వివరించింది.
మధ్య వయసువాళ్ల మరణాలు పెరగడం తీవ్రమైన హెల్త్ క్రైసిస్ ను సూచిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీని ప్రధాన కార ణం జాబ్ స్ట్రెస్, ఆర్థిక ఇబ్బందులు, లైఫ్ స్టైల్ లో మార్పులు, లోపాలు, హైపర్ టెన్షన్, డయాబె టిస్, గుండె సంబంధిత సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులు కారణమని వెల్లడిస్తున్నారు.