డబ్బుల కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి

డబ్బుల కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి

గచ్చిబౌలి, వెలుగు :  గచ్చిబౌలిలో కిడ్నాప్​కు గురైన ప్రైవేట్​ఉద్యోగి సురేందర్‌‌‌‌(37)  ఆచూకీ లభించింది.  కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద అటవీ శాఖ అధికారులు కిడ్నాపర్ల నుంచి సురేందర్‌‌‌‌ను కాపాడారు.  డబ్బుల కోసమే అన్న సురేందర్‌‌‌‌ను చెల్లె నిఖిత కిడ్నాపర్ సురేశ్ తో కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.  ప్రస్తుతం ముగ్గురు కిడ్నాపర్లను అరెస్టు చేయగా..  మరొకరు పరారీలో ఉన్నారు.  కిడ్నాపర్లు  శుక్రవారం సాయంత్రం కారులో శ్రీశైలం రోడ్డులో సురేందర్‌‌‌‌ను తీసుకువెళ్తుండగా కర్నూల్​ జిల్లా ఆత్మకూరు  బైరుట్టి వద్ద అటవీ శాఖ సిబ్బంది అనుమానం వచ్చి వీరి కారును అడ్డుకున్నారు.  

ఈ సమయంలో కారులో నుండి సురేందర్​హెల్ప్​ అంటూ అరవడంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని కాపాడారు.  సురేందర్​తో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోగా, మరో కిడ్నాపర్​ అక్కడి నుంచి పరారయ్యాడు.  కిడ్నాపర్ల చెర నుండి బయటపడ్డ సురేందర్​ సమాచారం అందుకున్న సైబరాబాద్​ పోలీసులు అక్కడికి చేరుకొని సురేందర్‌‌‌‌తో పాటు, ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని హైదరాబాద్​ తీసుకువచ్చారు.  రాయదుర్గం పోలీస్​ స్టేషన్​కు  తరలించి విచారిస్తున్నారు.  ఈ కేసులో నిఖితను పోలీసులు అదుపులోకి  తీసుకుని విచారిస్తున్నారు.   ఆదివారం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.