
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాకు అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా వెంకిచర్లకు చెందిన పంతుల నవీన్ (24), గన్నేరువరం మండలం చొక్కరావుపల్లికి చెందిన పెంటి బాలు (24), రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన పెద్దినాగరాజు(29) ఇల్లంతకుంటకు చెందిన కుంబాల సురేశ్(35) , మంథని మండలం కేశినపల్లి గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ (24) , గంగాధర మండలం లింగంపల్లికి చెందిన తోట మధు(28) ముఠాగా ఏర్పడి కొన్నేండ్లుగా పార్క్చేసిన బైక్లను చోరీ చేస్తున్నారు.
ఇందులో ఇద్దరు దొంగతనాలు చేయగా మిగతావారు వాటిని అమ్మి డబ్బులు పంచుకునేవారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్ పరిధిలో 11 బైక్లు, టూ టౌన్ పరిధిలో 9 బైక్లు, త్రీ టౌన్ పరిధిలో ఒక బైక్, రూరల్ పరిధిలో 2 బైక్లు, కొత్తపల్లి పీఎస్పరిధిలో 3 బైక్లు, వేములవాడ పీఎస్ పరిధిలో 2 బైక్లు, సరైన వివరాలు లేని 5 బైకులు మొత్తం 33 బైకులు దొంగిలించారు. టౌన్ పరిధిలో తనిఖీలు చేపట్టగా నిందితులు పట్టుబడ్డట్లు సీపీ వివరించారు. వారి నుంచి 33 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు సృజన్ రెడ్డి , శ్రీనివాస్, కోటేశ్వర్, జాన్ రెడ్డిని సీపీ అభినందించారు.