
- కొత్తగా మరో ఆరుగురికి పాజిటివ్
- రాష్ట్రంలో ఆరో కాంటాక్ట్ కేసు నమోదు
- కొత్తగూడెం డీఎస్పీకి, వాళ్ల ఇంట్లో పనిచేసే మహిళకు కూడా
- కొత్తగూడెం డీఎస్పీకి కరోనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చినవారితోపాటు లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఫారిన్ నుంచి వచ్చిన ముగ్గురికి, ఇప్పటికే విదేశాల నుంచి వచ్చినవారి కుటుంబ సభ్యులు ముగ్గురికి వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 39కు చేరింది. లోకల్గా కరోనా సోకిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ (57 ఏళ్లు), వారి ఇంట్లో వంట పనిచేసే మహిళ (33 ఏళ్లు) ఉన్నారు. ఈ డీఎస్పీ కుమారుడు ఈ నెల 18న లండన్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆయనకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక స్వీడన్ నుంచి హైదరాబాద్లోని మణికొండకు వచ్చిన పేషెంట్ నంబర్ 25 నుంచి 64 ఏండ్ల మహిళకు కరోనా సోకింది. ఇక ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి కూడా పాజిటివ్ గా తేలింది.
వైరస్ సోకిన ప్రాంతాల్లో హైఅలర్ట్
వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్టుగా గుర్తించిన ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైరస్ సంక్రమించిన ప్రాంతం నుంచి చుట్టూ మూడు కిలోమీటర్లు కంటామినెంట్జోన్గా, చుట్టూ ఏడు కిలోమీటర్ల దూరాన్ని బఫర్ జోన్గా ప్రకటించారు. హైదరాబాద్లోని మణికొండలో ఒక కిలోమీటర్ మేర కంటామినెంట్ జోన్గా, మూడు కిలోమీటర్లు బఫర్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. ఇక విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారు వచ్చిన ఫ్లైట్స్లో ఎవరెవరు ప్రయాణించారన్న సమాచారం ఇవ్వాలని ఎయిర్పోర్టు అధికారులకు ఆరోగ్యశాఖ లేఖ రాసింది.
రాష్ట్రంలో 17,283 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని వైద్యారోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. అయితే వారంతా ఇటీవలే వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారేనని స్పష్టం చేసింది. వారిలో ఇప్పటివరకు 764 మంది శాంపిల్స్ను సేకరించి టెస్టులు చేశామని, మొత్తం 37 మందికి పాజిటివ్గా తేలిందని, 699 మందికి నెగెటివ్ వచ్చిందని తెలిపింది. పాజిటివ్ కేసుల్లో 36 మంది హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ పొందుతున్నారని, ఒకరు డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 28 మంది టెస్టుల రిజల్ట్స్ రావాల్సి ఉందని తెలిపింది.
మరో ముగ్గురికి లోకల్ ట్రాన్స్మిషన్
రాష్ట్రంలో మంగళవారం మరో మూడు కరోనా పాజిటివ్ లోకల్ ట్రాన్స్మిషన్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న 34 ఏళ్ల యువకుడు స్వీడన్ నుంచి రంగారెడ్డి జిల్లా మణికొండలోని తన ఇంటికి వచ్చాడు. అతడికి 22న నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన తల్లి (64 ఏళ్లు)కి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేశారు. ఆమెకు కూడా వైరస్ వ్యాపించినట్టు తేలింది. ఇక ఈ నెల 18న లండన్ నుంచి కొత్తగూడెం వచ్చిన 23 ఏండ్ల యువకుడి నుంచి.. ఆయన తండ్రి (కొత్తగూడెం డీఎస్పీ)కి, ఇంట్లో పనిచేసే ఓ మహిళకు కూడా పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం గుర్తించారు. దీంతో రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దుబాయ్ వెళ్లి వచ్చిన సికింద్రాబాద్ వ్యాపారి నుంచి ఆయన కొడుకు, భార్యకు వైరస్ సోకగా, ఇండోనేషియా నుంచి వచ్చిన వారి నుంచి కరీంనగర్ కశ్మీర్ గడ్డకు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది.