
మంచిర్యాల, వెలుగు: ఎయిర్గన్స్తో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరుగురు సూడో నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు. సీపీ రెమా రాజేశ్వరి గురువారం మంచిర్యాల జిల్లా డీసీపీ ఆఫీస్లో ప్రెస్మీట్ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మేడి వెంకటేశ్(26), పెద్దంపేటకు చెందిన ఆరెందుల రాజేశ్(31) ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య బిజినెస్ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులువుగా డబ్బులు సాధించాలని నక్సల్స్ పేరుతో ఫోన్లు చేసి బెదిరించాలని అనుకున్నారు. వెంకటేశ్ హైదరాబాద్లో రెండు ఎయిర్ గన్స్ కొన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర సెల్ఫోన్, సిమ్కార్డు కొన్నారు. నస్పూర్లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేశారు. ఫిబ్రవరి 21న రాత్రి రాజేశ్ చెప్పిన ప్రకారం వెంకటేశ్ ఎయిర్ గన్స్ తీసుకెళ్లి ఇంటి ఆవరణలో ఉంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున కాంతయ్య, అతని కొడుకు నాగరాజుకు ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సల్స్ మాట్లాడుతున్నామని తెలిపారు. మీ ఇంటి ముందు తుపాకులు పెట్టామని, మీరు రూ.40 లక్షలు ఇవ్వకపోతే కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ఎవిడెన్స్సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు. రాజేశ్పై గతంలో మంచిర్యాల, హాజీపూర్ ఏరియాల్లో పలు కేసులున్నాయి. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంజీవ్, నస్పూర్ ఎస్సై ఎం.రవికుమార్, కానిస్టేబుళ్లు ఎండీ. సలీం, బి.దేవేందర్, శ్రీధర్, ఇర్షాద్లను సీపీ రెమా రాజేశ్వరి రివార్డ్ అందజేసి అభినందించారు.
మహబూబాబాద్లో నలుగురు..
మహబూబాబాద్: మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్చే సిన నలుగురు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ఇన్చార్జి డీఎస్పీ రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం..ప్రజా ప్రతిఘటన దళ కమాండర్ గా పనిచేసిన ఉప్పునూతల ముత్తయ్య, మరో ముగ్గురు కలిసి మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేద్దామని ప్లాన్వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొల్లి యాదగిరి రెడ్డి పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పరిధిలో ఉన్న తన పొలానికి ఇల్లందు నుంచి వచ్చి పోతుండేవాడు. యాదగిరిరెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు 15 రోజులు రెక్కీ చేశారు. గత ఏడాది డిసెంబర్20న పొలానికి వచ్చిన యాదగిరిరెడ్డిన మధ్యాహ్న సమయంలో ఎయిర్పిస్టల్తో బెదిరించి కిడ్నాప్ చేశారు. బైక్ పై చింతోని గుంపు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మావోయిస్టు పార్టీకి రూ.20 లక్షల చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి భయపడి కొడుకుకు చెప్పి రూ.1.25 లక్షలు తెప్పించి ఇచ్చాడు. నలుగురూ నకిలీ నక్సలైట్లని అనుమానించిన యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వెహికల్స్తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి నలుగురూ పారిపోతుండగా పట్టుకున్నారు. ఉప్పనూతల ముత్తయ్య, పసుల లింగయ్య, బత్తుల రామకృష్ణ, నిమ్మల లింగయ్యను అరెస్టు చేసి వారి నుంచి ఒక ఎయిర్గన్, నాలుగు సెల్ ఫోన్స్-, రెండు బైక్లు, రూ.1.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.