హైదరాబాద్, వెలుగు: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2026 ఎంపిక కోసం తెలంగాణ నుంచి ఆరుగురు టీచర్లు పోటీపడుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఎంపికైన వారిని వర్చువల్ మోడ్లో జాతీయస్థాయి స్వతంత్ర జ్యూరీ ఇంటర్వ్యూ చేసింది. డిజిటల్ ఇంగ్లిష్ ల్యాబ్స్, ఐసీటీ బోధనలో ప్రతిభ చూపిన డి.వెంకటేశ్వర్లు (ఆసిఫాబాద్), రోబోటిక్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసిన షేక్ తజ్బాబు (రంగారెడ్డి), వినూత్న గణిత బోధనలో పెండోటా రూపారాణి, బాలికల విద్యా ప్రోత్సాహంలో బొంపెల్లి భవాని (కామారెడ్డి), పప్పెట్రీ ద్వారా పాఠాలు చెప్పే మాదరి ఎల్లన్న (నిర్మల్), సీఎస్ఆర్ నిధులతో స్కూల్ను అభివృద్ధి చేసిన చందూరి రాజిరెడ్డి (జగిత్యాల) ఉన్నారు.
ఎంపికైన వారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ రంగంలో సృజనాత్మకత, సాంకేతికతను జోడించి వీరు చేస్తున్న విశేష కృషిని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు.
