వికారాబాద్, వెలుగు: దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు అక్కడే నిద్రపోవడంతో పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని గాంధీ కాలనీలో నివసించే నవీన్కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం స్వగ్రామమైన నవాబుపేట మండలం చించల్పేటకు వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ప్రధాన తలుపు తాళం పగులగొట్టినట్లు గుర్తించాడు.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన రూ.20 వేల నగదు, 2 తులాల 8 మాసాల నల్లపూసల బంగారు గొలుసు కనిపించలేదు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఓ యువకుడు బట్టలు లేకుండా మంచంపై నిద్రిస్తున్నట్లు గుర్తించి వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని గాంధీ కాలనీకి చెందిన సెంట్రల్ మెథడిస్ట్ చర్చి యూత్ ప్రెసిడెంట్ ఎస్.వరుణ్గా గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు.
