రూటు మార్చిన స్మార్ట్ఫోన్ల బ్రాండ్లు.. ఆఫ్లైన్పై ఫోకస్.. ఆన్లైన్లో తగ్గుతున్న అమ్మకాలు

రూటు మార్చిన స్మార్ట్ఫోన్ల బ్రాండ్లు.. ఆఫ్లైన్పై ఫోకస్.. ఆన్లైన్లో తగ్గుతున్న అమ్మకాలు
  • చిన్న పట్టణాలకు ప్రాధాన్యం
  • ఆన్​లైన్లో తగ్గుతున్న అమ్మకాలు

న్యూఢిల్లీ: స్మార్ట్‌‌‌‌ఫోన్ బ్రాండ్స్​ ప్రీమియం హ్యాండ్‌‌‌‌సెట్స్​ను అమ్మడానికి ఆన్​లైన్​కు బదులు షాపులు, షోరూమ్​ల వంటి ఆఫ్​లైన్​చానెల్స్​ వైపు  మొగ్గు చూపుతున్నాయి. చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఫోన్ల కొనుగోలుకు సులువుగా ఫైనాన్స్​  దొరుకుతుండటంతో ఈ ప్రాంతాలపై కంపెనీలు ఫోకస్​ చేస్తున్నాయి. ఆన్​లైన్​అమ్మకాలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ మార్పునకు ఒక కారణం.  ఆన్‌‌‌‌లైన్ రిటైలర్లకు షిప్‌‌‌‌మెంట్లు వరుసగా ఏడో నెల అయిన ఏప్రిల్​లో కూడా తగ్గాయి. ఆన్‌‌‌‌లైన్ -కేంద్రీకృత బ్రాండ్‌‌‌‌లు ఆఫ్​లైన్​ డిస్ట్రిబ్యూషన్​కు పెద్ద ఎత్తున మారడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ ఎక్స్​పర్టులు తెలిపారు.

"ఆన్‌‌‌‌లైన్ చానెల్ షిప్‌‌‌‌మెంట్లు వరుసగా రెండో నెలలోనూ రెండంకెలు దాకా తగ్గాయి. ఏప్రిల్‌‌‌‌లో ఇది 20శాతం కంటే ఎక్కువ తగ్గింది. ఆఫ్​లైన్​ చానెల్స్ 10శాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్​లైన్​కి ఇది వరుసగా ఎనిమిదో నెల వృద్ధి" అని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో మొత్తం షిప్‌‌‌‌మెంట్లు మార్చి నెలతో పోలిస్తే దాదాపు 12 మిలియన్లుగా స్థిరంగా ఉన్నాయని జోషి తెలిపారు.  ఐడీసీ స్టడీ ప్రకారం, దాదాపు అన్ని బ్రాండ్లు ఓమ్నీచానెల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. చిన్న పట్టణాలు/నగరాల్లో విస్తరిస్తూ, ఆకర్షణీయమైన చానెల్ మార్జిన్లను, మద్దతును అందిస్తున్నాయి.  

ఆఫ్​లైన్​లోనే ఎక్కువ అవకాశాలు​
భారతదేశంలో ఈ–-కామర్స్ ఇప్పుడున్న స్థాయి కంటే ఎదగడం కష్టమేనని కంపెనీలు భావిస్తున్నాయి. ఆన్‌‌‌‌లైన్ చానెల్స్​ బ్రాండ్‌‌‌‌లను మారుమూల ప్రాంతాలకు చేర్చడంలో సహాయపడినప్పటికీ, దేశంలో ఎక్కువమంది ఇప్పటికీ షాపుల ద్వారానే కొంటున్నారు. కరోనా సమయంలో ఆన్‌‌‌‌లైన్ అమ్మకాల్లో వచ్చిన ఊపు కొనసాగడం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఆఫ్​లైన్​లో కొనడానికి మొగ్గుచూపుతున్నారు.   ఆన్‌‌‌‌లైన్ అమ్మకాల వాటా 2025 మొదటి క్వార్టర్​లో 36శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇది ఏడాది క్రితం 45శాతం ఉండేది. అమ్మకాలను పెంచడానికి బ్రాండ్‌‌‌‌లు రిటైల్, పంపిణీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లపై ఆధారపడుతున్నాయి.

డిజైన్‌‌‌‌లు, స్పెసిఫికేషన్‌‌‌‌లలో పెరిగిన పోటీ బ్రాండ్లను ఆఫ్‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌లలో ఉత్పత్తులను ప్రదర్శించేలా చేస్తోందని కెనాలిసిస్​ ఎనలిస్ట్​ ఒకరు అన్నారు. షాపుల్లో ఫైనాన్సింగ్ కూడా చాలా సులభమని అన్నారు. కౌంటర్‌‌‌‌ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, సులభమైన లభ్యత, భారీ తగ్గింపులు, ప్రత్యేక లాంచ్‌‌‌‌ల కారణంగా వినియోగదారులు ఆన్‌‌‌‌లైన్ చానెల్స్​ వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. చాలా మంది వినియోగదారులు హ్యాండ్‌‌‌‌సెట్‌‌‌‌ల కోసం రూ.10,000–-రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేయడం లేదు. ఆఫ్‌‌‌‌లైన్ చానెల్స్​లోనూ పోటాపోటీ ధరలు, ఎక్కువ ఆఫర్లు, ఫైనాన్సింగ్‌‌‌‌ ఉండటంతో ప్రీమియం ఫోన్​ బయర్లు షాపులకు రావడానికే ఇష్టపడతున్నారని ఆయన అన్నారు.

ఆన్లైన్ ​చానెల్స్కు తగ్గిన పంపకాలు..
ఈ–కామర్స్​పై ఆకర్షణ తగ్గడం వల్ల దాదాపు ప్రతి బ్రాండ్ ఆన్‌‌‌‌లైన్ చానెల్స్​కు పంపే ఫోన్ల సంఖ్యను తగ్గించుకుంది. గతంలో ఈ-కామర్స్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడినవి కూడా ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు, మోటరోలా 2025 మొదటి క్వార్టర్లో ఆన్‌‌‌‌లైన్ చానెల్స్​కు షిప్‌‌‌‌మెంట్లను 64శాతానికి తగ్గించింది. ఇది ఏడాది క్రితం 82శాతం ఉండేది. వన్‌‌‌‌ప్లస్ షిప్​మెంట్లు ఇదే కాలంలో 85శాతం నుంచి 71శాతానికి తగ్గాయని మార్కెట్ రీసెర్చర్​ కెనాలిసిస్ తెలిపింది.

ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్ ద్వారా తన మనదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన చైనా కంపెనీ షావోమీ, ప్రస్తుతం తన మొత్తం అమ్మకాల్లో 39శాతం ఈ-కామర్స్ ద్వారా జరుగుతున్నాయి. గత ఏడాది మొదటి క్వార్టర్​లో  ఇవి 45శాతం ఉండేవని కెనాలిసిస్ డేటా వెల్లడించింది. ఆన్​లైన్​పై ఎక్కువ ఫోకస్​చేసిన షావోమీ ఇప్పుడు రూటు మార్చింది. ‘‘గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఓమ్నీచానెల్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. షావోమీ వినియోగదారునికి ఒకే రకమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్​లైన్​లో ఆఫ్​లైన్​లో ప్రొడక్టులు, ధరలు ఒకేలా ఉండేలా చూస్తున్నాం" అని షాయోమి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధిన్ మాథుర్ చెప్పారు.