
- చిన్న పట్టణాలకు ప్రాధాన్యం
- ఆన్లైన్లో తగ్గుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్స్ ప్రీమియం హ్యాండ్సెట్స్ను అమ్మడానికి ఆన్లైన్కు బదులు షాపులు, షోరూమ్ల వంటి ఆఫ్లైన్చానెల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఫోన్ల కొనుగోలుకు సులువుగా ఫైనాన్స్ దొరుకుతుండటంతో ఈ ప్రాంతాలపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. ఆన్లైన్అమ్మకాలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ మార్పునకు ఒక కారణం. ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు వరుసగా ఏడో నెల అయిన ఏప్రిల్లో కూడా తగ్గాయి. ఆన్లైన్ -కేంద్రీకృత బ్రాండ్లు ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్కు పెద్ద ఎత్తున మారడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ ఎక్స్పర్టులు తెలిపారు.
"ఆన్లైన్ చానెల్ షిప్మెంట్లు వరుసగా రెండో నెలలోనూ రెండంకెలు దాకా తగ్గాయి. ఏప్రిల్లో ఇది 20శాతం కంటే ఎక్కువ తగ్గింది. ఆఫ్లైన్ చానెల్స్ 10శాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్లైన్కి ఇది వరుసగా ఎనిమిదో నెల వృద్ధి" అని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో మొత్తం షిప్మెంట్లు మార్చి నెలతో పోలిస్తే దాదాపు 12 మిలియన్లుగా స్థిరంగా ఉన్నాయని జోషి తెలిపారు. ఐడీసీ స్టడీ ప్రకారం, దాదాపు అన్ని బ్రాండ్లు ఓమ్నీచానెల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. చిన్న పట్టణాలు/నగరాల్లో విస్తరిస్తూ, ఆకర్షణీయమైన చానెల్ మార్జిన్లను, మద్దతును అందిస్తున్నాయి.
ఆఫ్లైన్లోనే ఎక్కువ అవకాశాలు
భారతదేశంలో ఈ–-కామర్స్ ఇప్పుడున్న స్థాయి కంటే ఎదగడం కష్టమేనని కంపెనీలు భావిస్తున్నాయి. ఆన్లైన్ చానెల్స్ బ్రాండ్లను మారుమూల ప్రాంతాలకు చేర్చడంలో సహాయపడినప్పటికీ, దేశంలో ఎక్కువమంది ఇప్పటికీ షాపుల ద్వారానే కొంటున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ అమ్మకాల్లో వచ్చిన ఊపు కొనసాగడం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఆఫ్లైన్లో కొనడానికి మొగ్గుచూపుతున్నారు. ఆన్లైన్ అమ్మకాల వాటా 2025 మొదటి క్వార్టర్లో 36శాతానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇది ఏడాది క్రితం 45శాతం ఉండేది. అమ్మకాలను పెంచడానికి బ్రాండ్లు రిటైల్, పంపిణీ నెట్వర్క్లపై ఆధారపడుతున్నాయి.
డిజైన్లు, స్పెసిఫికేషన్లలో పెరిగిన పోటీ బ్రాండ్లను ఆఫ్లైన్ స్టోర్లలో ఉత్పత్తులను ప్రదర్శించేలా చేస్తోందని కెనాలిసిస్ ఎనలిస్ట్ ఒకరు అన్నారు. షాపుల్లో ఫైనాన్సింగ్ కూడా చాలా సులభమని అన్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ, సులభమైన లభ్యత, భారీ తగ్గింపులు, ప్రత్యేక లాంచ్ల కారణంగా వినియోగదారులు ఆన్లైన్ చానెల్స్ వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. చాలా మంది వినియోగదారులు హ్యాండ్సెట్ల కోసం రూ.10,000–-రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేయడం లేదు. ఆఫ్లైన్ చానెల్స్లోనూ పోటాపోటీ ధరలు, ఎక్కువ ఆఫర్లు, ఫైనాన్సింగ్ ఉండటంతో ప్రీమియం ఫోన్ బయర్లు షాపులకు రావడానికే ఇష్టపడతున్నారని ఆయన అన్నారు.
ఆన్లైన్ చానెల్స్కు తగ్గిన పంపకాలు..
ఈ–కామర్స్పై ఆకర్షణ తగ్గడం వల్ల దాదాపు ప్రతి బ్రాండ్ ఆన్లైన్ చానెల్స్కు పంపే ఫోన్ల సంఖ్యను తగ్గించుకుంది. గతంలో ఈ-కామర్స్పై ఎక్కువగా ఆధారపడినవి కూడా ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు, మోటరోలా 2025 మొదటి క్వార్టర్లో ఆన్లైన్ చానెల్స్కు షిప్మెంట్లను 64శాతానికి తగ్గించింది. ఇది ఏడాది క్రితం 82శాతం ఉండేది. వన్ప్లస్ షిప్మెంట్లు ఇదే కాలంలో 85శాతం నుంచి 71శాతానికి తగ్గాయని మార్కెట్ రీసెర్చర్ కెనాలిసిస్ తెలిపింది.
ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్ ద్వారా తన మనదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన చైనా కంపెనీ షావోమీ, ప్రస్తుతం తన మొత్తం అమ్మకాల్లో 39శాతం ఈ-కామర్స్ ద్వారా జరుగుతున్నాయి. గత ఏడాది మొదటి క్వార్టర్లో ఇవి 45శాతం ఉండేవని కెనాలిసిస్ డేటా వెల్లడించింది. ఆన్లైన్పై ఎక్కువ ఫోకస్చేసిన షావోమీ ఇప్పుడు రూటు మార్చింది. ‘‘గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఓమ్నీచానెల్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. షావోమీ వినియోగదారునికి ఒకే రకమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రొడక్టులు, ధరలు ఒకేలా ఉండేలా చూస్తున్నాం" అని షాయోమి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధిన్ మాథుర్ చెప్పారు.