చెన్నై: మమత బెనర్జీని సోషలిజం పెండ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల పెండ్లికి కమ్యూనిజం, లెనినిజం, మార్క్సిజం హాజరవబోతున్నారు. ఏంటిది చిత్రంగా ఉందనుకుంటున్నారా? అక్షరాలా నిజం. ఎందుకంటే ఇక్కడ పేర్లు చెప్పినవాళ్లందరూ మనుషులే. తమిళనాడుకు చెందిన సోషలిజం, మమత బెనర్జీ జంట జూన్ 13న పెండ్లి చేసుకోబోతోంది. వీళ్ల పెండ్లిపత్రికలో పేర్లు కాస్త డిఫరెంట్గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరలైంది.
కమ్యూనిజాన్ని బతికించాలని..
తమిళనాడులోని సీపీఐ సేలం జిల్లా కార్యదర్శి మోహన్. కమ్యూనిస్టు పార్టీతో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉంది. ఆయన మొదటి కొడుకు పుట్టినప్పుడు 1990ల్లో సోవియట్ యూనియన్ విడిపోయింది. వార్తల్లో ఎక్కడ చూసినా కమ్యూనిజానికి ఇదే ముగింపని రావడంతో దాన్ని ఎలాగైనా బతికించుకోవాలనుకొని కొడుకుకు కమ్యూనిజం పేరు పెట్టారు. లెనిన్ మీద అభిమానంతో రెండో కొడుకుకు లెనినిజం అని, మూడో కొడుకు పేరు సోషలిజం అని పెట్టారు. లెనినిజం తన కొడుకుకు మార్క్సిజం అని పేరు పెట్టారన్నారు. మనవరాలు పుడితే క్యూబాయిజం పెడతామని చెప్పారు. ప్రపంచానికి ఈ పేర్లు కొత్తే అయినా తమకు మాత్రం అన్నీ పాతవేనని మోహన్ చెప్పారు. తమ ప్రాంతంలోని వారికి మాస్కో, రష్యా, వియత్నాం, చెకోస్లొవేకియా వంటి పేర్లున్నాయన్నారు.
మమత మీద మమకారంతో..
పెండ్లి కూతురు మమత బెనర్జీ కుటుంబీకులు కాంగ్రెస్ మద్దతుదారులు. ప్రస్తుత పశ్చి మ బెంగాల్ సీఎం మమత ఒకప్పుడు కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నారు. అప్పట్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆమె పేరును పెండ్లికూతురుకు ఆమె తాత పెట్టారు. సోషలిజం, మమత కుటుంబీకులు దగ్గరి బంధువులు కావడంతో వాళ్లిద్దరి పెండ్లి జరుగుతోంది.