సాఫ్ట్​వేర్ కంపెనీలు మార్చిలో రీ ఓపెన్

సాఫ్ట్​వేర్ కంపెనీలు మార్చిలో రీ ఓపెన్
  • ఏర్పాట్లు చేస్తున్న మేనేజ్ మెంట్స్
  • వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన క్వాలిటీ కంటెంట్
  • వ్యాక్సిన్ రావడంతో ధైర్యంగా ఉన్న ఎంప్లాయీస్
  • సెక్యూరిటీ, క్లీనింగ్ సిబ్బందికి టీకా ఇవ్వాలని టీఎఫ్ఎంసీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సిటీలోని సాఫ్ట్​ వేర్ కంపెనీలు మార్చిలో మళ్లీ రీ ఓపెన్ కానున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో గతేడాది మార్చి నుంచి ఐటీ కంపెనీలు క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తగ్గడం, వ్యాక్సిన్ రావటంతో మళ్లీ పూర్తి స్థాయిలో కంపెనీలను స్టార్ట్ చేయాలని మేనేజ్ మెంట్లు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానంతో   ఎంప్లాయీస్​తో పని చేయించాయి. మార్చి 1 నుంచి ఇక వర్క్ ఫ్రమ్ హోమ్​ను ఆపేసి ఆఫీసుల్లోనే పనిచేయించనున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నప్పటికీ చిన్న కంపెనీలు మాత్రం ఎంప్లాయీస్ 1వ తేదీ నుంచి రావాలని మెయిల్స్ పంపిస్తున్నాయి. సిటీలో స్మాల్ అండ్ మీడియం రేంజ్ ఐటీ కంపెనీలు కనీసం 3 వేల వరకు ఉంటాయి. వీటిలో దాదాపు 50%నికి పైగా రీ ఓపెన్ కు రెడీ అయ్యాయి.

వ్యాక్సిన్ రావడంతోనే

కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గే వరకు వర్క్ ఫ్రమ్ హోం ను కంటిన్యూ చేయాలని ముందుగా చాలా కంపెనీలు భావించాయి. కానీ వ్యాక్సిన్ రావటంతో నిర్ణయాన్ని మార్చుకున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో పాటు వ్యాక్సిన్ వచ్చిన కారణంగా  కరోనా కేసులు ఇప్పటికే చాలా తగ్గాయి. గతంలో ఉన్నంత ప్రమాదకరంగా లేకపోవటంతో ఆఫీస్ లు ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాయి.  దీనికి తోడు కరోనా గైడ్ లైన్స్ ను పూర్తిగా పాటించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. శానిటైజేషన్  తో పాటు మాస్క్ లు లేకుండా ఎంప్లాయీస్ ను లోపలికి ఎంటర్ కానివ్వమని చెబుతున్నాయి. ఫిజికల్ డిస్టెన్స్ ను కూడా మెయింటెన్ చేసేలా సీటింగ్స్ ను ఆరెంజ్ చేస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయి. మరో మూడు నెలల్లో చిన్న కంపెనీలన్నీ మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీల్లో పనిచేసే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన సెక్యూరిటీ, క్లీనింగ్ స్టాఫ్ కు వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్ మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

తగ్గిన క్వాలిటీ కంటెంట్ 

వర్క్ ఫ్రమ్ హోం స్టార్టింగ్​లో ఎంప్లాయీస్ ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం వర్క్ లో క్వాలిటీ తగ్గింది. దీనికి ప్రధానంగా ఇంట్లో వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ లేకపోవటమే. పైగా వర్క్ ఫ్రమ్ హోంలో  చాలా కంపెనీలు ఎంప్లాయీస్ తో 2–4 గంటల టైమ్ ఎక్కువగా పనిచేయిస్తున్నాయి. దీంతో వారు విసిగిపోతున్నారు. కొలిగ్స్ లేకపోవటం, రిలాక్స్ అయ్యేందుకు టైమ్ దొరక్కపోవటంతో చాలా మంది వర్క్ పై కాన్సన్ ట్రేట్ చేయలేకపోతున్నారు. పైగా మాటిమాటికి కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ లతో ఉదయం నుంచి రాత్రి వరకు పనిలో ఉండాల్సి వస్తోంది. దీంతో చాలా మంది  సరిగా వర్క్ చేయలేకపోతున్నారు. దీనికి తోడు నెట్ వర్క్స్ ప్రాబ్లమ్స్ ఇతర సమస్యలతో క్వాలిటీ కంటెంట్ చాలా వరకు తగ్గింది. ఈ ఎఫెక్ట్ చాలా కంపెనీలకు కొత్త ప్రాజెక్ట్ లు రాకుండా చేస్తుండటంతో సంస్థలు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపేయాలని నిర్ణయించాయి.

ఆఫీసే బెటర్

ఎంప్లాయీస్ చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎప్పుడూ ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరున్నర లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. చాలా మంది సొంతూళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఊళ్లలో   నెట్ వర్క్ పనిచేయకపోవటం, గంటల తరబడి ఆఫీస్ పనిమీద ఉండటం వారికి కష్టంగా మారుతోంది. సిటీలో ఉన్న వాళ్లు కూడా  ఇంట్లోనే ఉండటంతో స్ట్రైస్ ఫీలవుతున్నారు. కొలిగ్స్ తో మాట్లాడే చాన్స్ లేక , డౌట్ వస్తే అడగటానికి ఎవరూ లేకపోవటంతో బోర్ గా  ఫీలవుతున్నారు. ఆఫీసులో అందరితో కలిసి వర్క్ చేయటమే బెటర్ అని చెబుతున్నారు.

జనవరి నుంచే వస్తున్నరు

మా ఆఫీసు జనవరిలోనే రీ ఓపెన్ అయ్యింది. ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు. వచ్చే నెలలో మిగతా కంపెనీలు కూడా ఓపెన్ అవుతాయని అనుకుంటున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లో క్వాలిటీ కంటెంట్ ఉండటం లేదు.  అందుకే మా మేనేజ్ మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. డైలీ థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ చేస్తున్నాం. ఆఫీసుకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా చూస్తున్నాం.

‑  చైతన్య, ఐటీ కంపెనీ హెచ్ఆర్, మాదాపూర్

వర్క్ ఫ్రమ్ హోమ్ తో విసిగిపోయా

గత నెలలోనే మా ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. 10 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ తో విసిగిపోయా. ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వర్క్ పై కాన్సన్ ట్రేషన్ చేయలేకపోయా. ఇప్పుడు కొలిగ్స్ తో కలసి పనిచేయటం బాగుంది. అన్ని కంపెనీలు మార్చి లో ఓపెన్ అయితే సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది.

‑ సారిక, ఐటీ ఎంప్లాయ్

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వాలె

కంపెనీలన్నీ రీ ఓపెన్ కు రెడీ అవుతున్నాయి. సెక్యూరిటీ, క్లీనింగ్ సెక్షన్లలో పనిచేసే వారందరికీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలె. దీంతో కరోనా ఎఫెక్ట్ ను చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకు సంబంధించి హెల్త్ డైరెక్టర్ ను కలిసి ఇప్పటికే విజ్ఞప్తి చేశాం.

– సత్యనారాయణ్ మథాలా, టీఎఫ్ఎంసీ, అధ్యక్షుడు