
చంటిపిల్లలకి ఆర్నెల్లు పడేంత వరకు తల్లిపాలే ఆధారం. ఏడాదికి దగ్గర పడుతున్న పిల్లలకి శక్తి ఎక్కువ కావాలి. అందుకోసం రోజులో కొంతైనా తేలికగా అరిగే తిండి పెట్టాలి. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే అన్ని పోషకాలున్న ఫుడ్ ఇవ్వడం ముఖ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్, లవ్నీత్ బాత్రా. మొదట అన్నం తినిపించాలి. అన్నంతో పాటు నీళ్లు తాగించాలి. బియ్యంలో పిండిపదార్థంతో పాటు మరికొన్ని పోషకాలు ఉంటాయి. ఎనర్జీ వస్తుంది. అలర్జీలు కూడా రావు. ఏడాది వయసులోపు పిల్లలకి పండ్లు కూడా తినిపించొచ్చు. ఫ్రూట్స్లో వాళ్లకి అవసరమైన పోషకాలన్నీ దొరుకుతాయి. పండ్లలో కూడా మొదటగా తియ్యటివే అలవాటు చేయాలి. యాపిల్తో మొదలుపెడితే మరీ మంచిది. యాపిల్ తొక్క తీసి, మెత్తటి గుజ్జులా చేసి, టేబుల్స్పూన్తో కొద్ది కొద్దిగా తినిపించాలి. అన్ని రకాల పోషకాలు ఉన్న వెజిటబుల్స్ పిల్లల్ని హెల్దీగా ఉంచుతాయి. తల్లి పాలతో పాటు ఉడికించిన కూరగాయ ముక్కలు తినిపిస్తే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు. వీటిలో కూడా ఆలుగడ్డ, క్యారెట్ అయితే బెటర్. బీన్స్, సొరకాయ, గుమ్మడికాయ కూడా తినిపించొచ్చు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల్ని మాత్రమే పెడితే మంచిది. అన్నం, కూరగాయలే తినిపిస్తుంటే పిల్లలు ముఖం తిప్పుకుంటారు. ఓట్స్ జావ కూడా ఈజీగా అరుగుతుంది. ఓట్స్ జావ రుచిగా రావాలంటే పండ్లు, కూరగాయల ముక్కలు కలిపినా ఓకే. పోషకాలు ఉన్న ఓట్స్ జావని పిల్లలు ఇష్టంగా తింటారు.