కుటుంబ సభ్యుల ఆరోపణ
డీల్ వివరాలతో లెటర్ వచ్చిందని వెల్లడి
హిసార్ : బీజేపీ హర్యానా లీడర్ సోనాలీ ఫొగట్ హత్య కేసులో కుట్ర జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోనాలీని చంపేందుకు రూ.10 కోట్లతో డీల్ జరిగిందని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు లెటర్ వచ్చిందని చెప్పారు. నెల రోజుల వ్యవధిలో రెండు లెటర్లు వచ్చాయని, ఒక దాంట్లో ఈ డీల్ గురించి ఉందని వివరించారు. ఇటీవలే అందుకున్న మరో లెటర్లో పలువురు రాజకీయ నేతల పేర్లు ఉన్నాయని సోనాలీ మరిది అమన్ పూనియా తెలిపారు. సోనాలీ హత్య కేసులో వారి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
తమకు అందిన రెండు లెటర్లను పోలీసులకు అందజేశామని పూనియా చెప్పారు. ఈ లెటర్ల ఆధారంగా సోనాలీ హత్య వెనక ఉన్న కుట్రను ఛేదించాలని, హంతకులను పట్టుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, ఆమ్ఆద్మీ పార్టీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పూనియా తేల్చిచెప్పారు. సోనాలీతో పాటు తమ కుటుంబం మొత్తం బీజేపీలోనే ఉందని తేల్చిచెప్పారు. సోనాలీ సోదరి రుకేశ్వచ్చే ఎన్నికల్లో ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
