వలస కార్మికుల కోసం మరో మూడు రైళ్లు ఏర్పాటు చేసిన సోనూ సూద్

వలస కార్మికుల కోసం మరో మూడు రైళ్లు ఏర్పాటు చేసిన సోనూ సూద్

లాక్‌డౌన్‌ తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సాయం చేస్తూ సినీనటుడు సోనూ సూద్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వలస కార్మికులందరూ తమ ఇళ్లకు వెళ్లే వరకు సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించిన ఆయన  లేటెస్ట్ గా వారి కోసం మూడు రైళ్లు బుక్‌ చేశాడు. ఇప్పటి వరకు ఎంతో మంది వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు తరలించాడు. ఇంకా 70 వేల మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు సోనూ సూద్ తెలిపాడు

బీహార్‌, యూపీ నుంచి ఉపాధి కోసం ముంబైకి వచ్చి ఉంటున్న వలస కార్మికులను తమ ఇళ్లకు చేర్చేందుకు ఈ రైళ్లను ఏర్పాటు చేశాడు. తాను మొదటి సారి కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసి, ముంబై నుంచి కర్ణాటకకు పంపినప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ ఎక్కువయ్యాయని చెప్పారు. కాల్స్ ఎక్కువగా వస్తుండడంతో కొన్ని కాల్స్‌, మెస్సేజ్‌లను మిస్సయ్యానని చెప్పాడు.

అందరికీ అందుబాటులో ఉండేలా తాను ఇటీవల ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశానని తెలిపాడు సోనూ. ఒకేసారి చాలా మందిని పంపించడానికే రైళ్లను బుక్ చేసినట్లు తెలిపాడు. తాను చేస్తోన్న ఈ పనికి మద్దతు తెలుపుతూ సాయం చేస్తున్న సినీ పరిశ్రమ, ఇతర రంగాల్లోని స్నేహితులకు ధన్యవాదాలు చెబుతూ సోనూ సూద్ ట్వీట్ చేశాడు.