
- గ్రేటెస్ట్ సౌతాఫ్రికా.. సఫారీలే వరల్డ్ టెస్ట్ చాంపియన్స్
- డబ్ల్యూటీసీ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఆసీస్పై విక్టరీ
- తొలిసారి టెస్టు గద అందుకున్న సఫారీ టీమ్
- 27 ఏండ్ల విరామం తర్వాత ఐసీసీ టైటిల్ సొంతం
సౌతాఫ్రికా సాధించింది. టెస్టు క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తూ.. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు కలగా మారిన ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. మేజర్ టోర్నీల్లో, మెగా మ్యాచ్ల్లో తడబడే బలహీనత నుంచి బయటపడుతూ.. తమపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపేస్తూ .. ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో చిందేసింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచి ఈ ఫార్మాట్లో గ్రేటెస్ట్ టీమ్గా అవతరించింది. ఫైనల్ చేరిన తొలిసారే టెస్టు గద అందుకొని గర్జించింది.
ఇది వరకు ప్రతీ టైటిల్ ఫైట్లో పల్టీ కొట్టి గుండెకోతతో గ్రౌండ్లో కన్నీళ్లు పెట్టుకునే సఫారీలు ఈ సారి మేటి జట్టు ఆస్ట్రేలియాను పడగొట్టి క్రికెట్ మక్కా లార్డ్స్లో తొడగొట్టారు. ఇప్పటివరకు సౌతాఫ్రికాకు వరల్డ్ క్లాస్ విజయం అనగానే 1998 చాంపియన్స్ ట్రోఫీ(ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) మాత్రమే గుర్తుకొచ్చేది. ఆ తర్వాత ఆడిన ఫైనల్స్లో ఓడిన చరిత్రను చెరిపేస్తూ ఈసారి అత్యుత్తమ ఫార్మాట్లో ఐసీసీ కిరీటాన్ని గెలుచుకుని లోటును తీర్చుకుంది. ఐసీసీ ఫైనల్స్ అనగానే రెచ్చిపోయి ఆడే ఆస్ట్రేలియాపై లభించిన ఈ విక్టరీ సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ హిస్టరీలో చిరకాలం నిలిచిపోవడం ఖాయం.
లండన్: కల నిజమైంది. ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఫలించింది. పట్టువదలని పోరాటానికి ఫలితం లభించింది. 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ మరో ఐసీసీ ట్రోఫీ అందుకొని సగర్వంగా తలెత్తుకుంది. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాను మట్టి కరిపిస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో కొత్త విజేతగా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో సఫారీ టీమ్ ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (207 బాల్స్లో 14 ఫోర్లతో 136) అత్యద్భుత సెంచరీతో విజృంభించిన వేళ కంగారూ టీమ్ ఇచ్చిన 282 రన్స్ టార్గెట్ను సఫారీ టీమ్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
ఓవర్నైట్ స్కోరు 213/2తో ఛేజింగ్ కొనసాగించిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఉదయం సెషన్లోనే గెలుపు లాంఛనం పూర్తి చేసింది. 141 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో లార్డ్స్ గ్రౌండ్లో ఛేజ్ చేసిన సెకండ్ హయ్యెస్ట్ స్కోరు ఇదే కావడం విశేషం. కెప్టెన్ టెంబా బవూమ (66) తొందరగానే ఔటైనా.. మార్క్రమ్ జట్టుకు హిస్టారికల్ విక్టరీ అందించాడు. స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 212, సౌతాఫ్రికా 138 స్కోర్లు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో కంగారూ టీమ్ 207 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో సెంచరీతో పాటు రెండు వికెట్లు కూడా తీసిన మార్క్రమ్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మార్క్రమ్ వదల్లేదు..
నాలుగో రోజు ఆట మొదలయ్యేసరికి సౌతాఫ్రికా విజయానికి 69 రన్స్ అవసరం కాగా, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మూడో రోజే మ్యాచ్ను ఏకపక్షం చేసిన ఓవర్నైట్ బ్యాటర్లు బవూమ, మార్క్రమ్ క్రీజులో ఉన్నారు. కానీ, ఫైనల్స్లో తడబడే ఆ టీమ్ గత చరిత్ర నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఆశలు కోల్పోలేదు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నప్పటికీ పట్టుదలతో ఆడిన సఫారీ కెప్టెన్ బవూమను ఆట మొదలైన మూడో ఓవర్లోనే కమిన్స్ ఔట్ చేశాడు. దాంతో మూడో వికెట్కు 147 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వగా.. కంగారూ టీమ్లో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (8)ను మిచెల్ స్టార్క్ బుల్లెట్లాంటి బాల్తో క్లీన్బౌల్డ్ చేశాడు. దాంతో సౌతాఫ్రికాపై ఒత్తిడి పెరిగింది. అప్పటికి సఫారీలకు మరో 41 రన్స్ అవసరం అయ్యాయి. అయితే, సెంచరీ హీరో మార్క్రమ్ పోరాటం వదలకుండా జట్టును ముందుండి నడిపించాడు. క్రమం తప్పకుండా బౌండ్రీలు బాదుతూ టార్గెట్ను కరిగించాడు.
ఇంకో ఎండ్లో అతనికి డేవిడ్ బెడింగ్హామ్ (21) నుంచి మంచి సపోర్ట్ లభించింది. వికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఆస్ట్రేలియా తమ మూడు రివ్యూలను వేస్ట్ చేసుకుంది. విజయానికి ఆరు రన్స్ దూరంలో మార్క్రమ్.. హేజిల్వుడ్ బౌలింగ్లో హెడ్కు క్యాచ్ ఇచ్చాడు. తను మైదానం వీడుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం చప్పట్లతో అభినందించారు. స్కోర్లు సమమైనప్పుడు కైల్ వెరెన్ (4 నాటౌట్) కీపర్కు క్యాచ్ ఇచ్చినా అంపైర్ ఔటివ్వలేదు. అప్పటికే మూడు డీఆర్ఎస్లను వేస్ట్ చేసిన ఆసీస్ రివ్యూ అడగలేకపోయింది. చివరకు స్టార్క్ వేసిన ఫుల్ టాస్ బాల్ను కవర్స్ మీదుగా ఆడిన వెరెన్ విన్నింగ్ రన్ కొట్టడంతో సౌతాఫ్రికా ప్లేయర్లు, ఫ్యాన్స్ విక్టరీ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్; సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 282): 83.4 ఓవర్లలో 282/5 (మార్క్రమ్ 136, బవూమ 66, , స్టార్క్ 3/66).