పెంపుడు సింహాల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన వెస్ట్ మ్యాథ్యూసన్(65) అనే వ్యక్తి రెండు సింహం పిల్లలను వాటి చిన్నప్పటినుంచి పెంచుతున్నాడు. బుధవారం ఉదయం వాటితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లగా.. వాకింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఓ సింహం ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సింహం కూడా దాడికి దిగింది.
ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య సివంగుల నుంచి భర్తను రక్షించటానికి శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సింహాల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సింహాలను మ్యాథ్యూసన్ ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.