
రీల్లోనే కాదు.. రియల్గాను హీరోలు అనిపించుకుంటున్నారు మన స్టార్స్. దేశంలో ఎక్కడ, ఎలాంటి విపత్తులు వచ్చినా మేమున్నాం అంటూ తమవంతు బాధ్యతగా నిలుస్తున్నారు. కేరళలోని వయనాడ్లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ వారికి అండగా నిలుస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ వంతు సాయం చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ సైతం తన వంతుగా రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల తర్వాత, కేరళలో ఎనలేని అభిమానుల్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈ సందర్భంగా కేరళలో నెలకొన్న పరిస్థితి తనని బాధించిందని ట్వీట్ చేశాడు. ఇక హీరోయిన్లలో రష్మిక పది లక్షలు ప్రకటించగా, సంయుక్త మీనన్ వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్కు ఆదివారం ఆమె చెక్ను అందజేసింది.
తెలుగు ఇండస్ట్రీ నుంచి నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు సాయం అందించడమే కాకుండా, లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే తమిళ నటులు సూర్య, కార్తి, జ్యోతిక కలిసి 50 లక్షల రూపాయలను ఇవ్వగా, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్, నజ్రియా రూ.25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి రూ.15 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.